Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అహర్శిశలు శ్రమించిన ప్రముఖ వాగ్గేయ కారుడు, విప్లవకవి వంగపండు ప్రసాదరావు ఇకలేరనే వాస్తవాన్ని తెలుగు చిత్రసీమ జీర్ణించుకోలేకపోతోంది. అరుదైన పాటల ద్వారా అటు ప్రేక్షకులు, ఇటు శ్రోతల మనసులపై చెరగని సంతకం చేసిన జానపద కళాకారుడు వంగపండు మృతి చిత్ర సీమకు తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. 'అర్థరాత్రి స్వాతంత్య్రం' చిత్రంతో సినీ ప్రస్థానం ఆరంభించిన వంగపండు 'ఏం పిల్లడో ఎల్దమొస్తవ' వంటి ఎన్నో జానపద పాటలతో అందర్నీ ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడారు. దాదాపు 30కి పైగా సినిమాల్లో 400 పాటలు రాశారు. ఆయన పాటలన్ని విశేష ఆదరణ పొందాయి. ఉత్తరాంధ్ర జానపదానికి కాణాచిగా నిలిచిన వంగపండు చివరి వరకు జనపదమే..జానపదమని నమ్మిన విప్లవకవి వంగపండు అని కథానాయకుడు పవన్కళ్యాణ్ చెప్పారు.
విలువలతో సహజీనవం చేసిన విప్లవ గాయకుడు
వంగపండు ప్రసాదరావు తన స్వరాన్ని భాస్వరంగా మార్చిన ప్రజా గాయకుడు. ఆంధ్రప్రదేశ్లో అధికారం రెండు వర్గాల గుప్పెట్లోనే నలిగిపోతోందని ఆగ్రహం, ఆవేదనతో రగిలిన సామాజిక వేత్త. తన పాట ద్వారా తాడిత, పీడిత వర్గాల గుండె చప్పుళ్ళను తన గళంతో ప్రపంచానికి వినిపించిన విప్లవ గాయకుడు. ఆయన స్వరం అలసి సొలసి విశ్రమించింది కాని ఆయన ఆశ, ఉత్తరాంధ్ర కొండ కోనల్లో ప్రతి ధ్వనిస్తూనే ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఊపిరి పోసుకున్న నక్సల్బరీ ఉద్యమంతో ప్రేరణ పొంది ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి ప్రజా పోరాటమే సర్వస్వంగా భావించిన యోధుడు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పోరాటానికి ప్రజలను కదలి రమ్మని ఆయన రచించిన 'ఏం పిల్లడో ఎల్దు మొస్తవ..' అంటూ సాగే విప్లవ గీతం ఉత్తరాంధ్రనే కాకుండా యావత్ తెలుగు వారందరినీ జాగృతం చేసింది. మరో విప్లవ గాయకుడు గద్దర్తో కలిసి జన నాట్య మండలిని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కళా సేవ చేశారు. గిరిజనులు, ఉత్తరాంధ్ర జీవన వైవిధ్యాన్ని తన పాటలకు ప్రేరణగా చేసుకున్నారు. సినిమాలకు సైతం విలువలతో కూడా గీతాలను అందించారు. 'జజ్జనకర జనారే..' అంటూ తనదైన శైలి పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. విలువలతో సహజీవనం చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన వంగపండుకి నివాళులు అర్పిస్తున్నాను. - పవన్కళ్యాణ్
ఉత్తరాంధ్ర సంతకం వంగపండు
తనదైన జానపద పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప విప్లవ గాయకుడు, ఉత్తరాంధ్ర సంతకం వంగపండు. ప్రజా కవి, విప్లవకవి, ప్రముఖ వాగ్గేయ కారుడు వంగపండు మరణం తీరని లోటు. నిజమైన ప్రజాకవి నేను కాదు వంగపండు, గద్దర్ అని స్వయంగా శ్రీశ్రీ అన్నారంటే వారి గొప్పతనం ఏంటో మనం చెప్పక్కర్లేదు. జానపద జన్యుగా కీర్తి పొందిన వంగపండు పాడిన ఎన్నో జానపదాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన రాసిన 'భూమి భాగోతం' నృత్యరూపం అబాలగోపాలన్ని ఉర్రూతలూగించింది. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. నా తొలి చిత్రం 'అర్థరాత్రి స్వతంత్య్రం'నికి పాటలు రాసి, పాడారు. అంతేకాదు నటించి నా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశారు. మాదాల రంగారావు, టి.కృష్ణ, దాసరిగారి చిత్రాలకు ఆయన రాసిన పాటలు అఖండ విజయాన్ని సాధించాయి.
- ఆర్.నారాయణమూర్తి