Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొన్ని సినిమాల్లో నటించడం అనేది మనముందు అనేక ప్రశ్నలను ఉంచుతుంది. అయితే ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు మన దగ్గరుంటే వాటిల్లో నటించడానికి ఏ మాత్రం సంకోచించవద్దు' అని అంటున్నారు బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్. బాలీవుడ్లో మహిళా ప్రధాన చిత్రాలకు నాంది పలికిన కథానాయికల్లో విద్యాబాలన్ది ప్రత్యేక స్థానం. ఓ పక్క గ్లామర్ పాత్రలను పోషిస్తూనే మరో పక్క మహిళా ప్రధాన చిత్రాలు, శక్తివంతమైన కథానాయిక పాత్రలను పోషించి ఆమె ప్రేక్షకులను అలరించారు. ఇటీవల 'హ్యూమన్ కంప్యూటర్' శకుంతలా దేవి బయోపిక్లో విద్యా నటించారు. ఓటీటీ ప్లాట్పామ్ ద్వారా విడుదలైన 'శకుంతలా దేవి' సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది.
ఈ నేపథ్యంలో తన కెరీర్లో సవాళ్లుగా నిలిచిన చిత్రాల గురించి విద్యా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ,'కొన్ని సినిమాల్లో నటించేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి సినిమాల్లో ఎందుకు నటిస్తున్నారని ప్రశ్నించినప్పుడు నవ్వొస్తుంది. ఎందుకంటే నటీనటులు తన ప్రతిభను చూపించుకోవడానికి భిన్న కోణాలున్న పాత్రలు, సినిమాల్లో నటించాల్సి ఉంటుంది. నేను సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిస్తున్న 'డర్టీ పిక్చర్'లో నటిస్తున్నప్పుడు నాకు పిచ్చిపట్టిందని చాలా మంది అన్నారు. అలాగే ఇలాంటి సినిమాలోనా.. అంటూ దీర్ఘాలు తీస్తూ ప్రశ్నలను సంధించారు. అయితే వాటిని నేనేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే దర్శకుడు మిలాన్ నా మీద నమ్మకం ఉంచారు. అలాగే ఆయనకి ఉన్న కళా సౌందర్యం కారణంగా ఈ సినిమా చెత్తగా ఉండదని భావించాను. అలాగే ఈ సినిమాకి ఏక్తా కపూర్ నిర్మాత. ఆమె కూడా మహిళే. ఓ మహిళను కించపరిచే రీతిలో ఈ సినిమాని ఆమె నిర్మించదనే నమ్మకం కలిగింది. అయితే మా అమ్మానాన్నలను ఈ సినిమా చేయాలా వద్దా అని అడిగితే, నీకు సరైందనిపిస్తే చేరు.. అని ప్రోత్సహించారు' అని తెలిపింది.