Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వవ్యాప్తంగా అన్ని రంగాల మాదిరిగానే సినిమా రంగంపై కూడా కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఆ ప్రభావం నుంచి బాలీవుడ్ తప్పించుకునే ప్రయత్నంలో కొంత మేరకు సక్సెస్ అయ్యింది. దాదాపు రూ.1000 కోట్లకు పైగానే బిజినెస్ చేసి కొంతమంది నిర్మాతల్ని ఆర్థికంగానూ కాపాడింది. ఈ కరోనా కష్ట కాలంలోనూ వెయ్యి కోట్ల బిజినెస్ బాలీవుడ్కి ఎలా సాధ్యమైంది?
యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. దీని ప్రభావం వల్ల అన్ని రంగాల ఆర్థిక పరిస్థితిపై కోలుకోలేని దెబ్బ పడింది. ఇందులో సినిమా రంగానికి కూడా మినహాయింపు లేదు. ఈ కరోనా విజృంభణ ధాటికి హాలీవుడ్ సైతం విలవిలలాడిపోతోంది. చాలా అరుదుగా సినిమాల రిలీజుల్ని వాయిదా వేసే హాలీవుడ్ కూడా ఇప్పుడు తరచూ విడుదల తేదీలను మార్చేస్తోంది. ఇదే స్థితిలో దాదాపు అన్ని దేశాల చిత్ర పరిశ్రమలూ ఉన్నాయి. అలాగే సినిమాల చిత్రీకరణల విషయంలోనూ ఆశించిన స్థాయిలో ఉత్సాహభరితంగానూ కొనసాగడం లేదు.
కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్తో థియేటర్లు మూత పడటంతో రిలీజ్కి రెడీగా ఉన్న సినిమాల విడుదల సైతం ఆగిపోయింది. దీని వల్ల చాలా మంది నిర్మాతలు ఆర్థికంగా బాగా నష్టపోయారు. గత నాలుగు నెలలుగా థియేటర్లు మూతపడే ఉన్నాయి. అంతేకాదు ఇవి ఎప్పుడు తెరచుకుంటాయో కూడా ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. ఇటువంటి తరుణంలో అటు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి, ఇటు నిర్మాతలకు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ (ఓవర్ ది టాప్) ఫ్లాట్ఫామ్స్ రంగంలోకి దిగాయి. ఉన్న పరిస్థితుల్లో థియేటర్లకి వెళ్ళి కరోనాని కొని తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే కూర్చుని నచ్చిన సినిమాని ఓటీటీ ద్వారా చూసే అవకాశానికే ప్రేక్షకులు సైతం ఓట్లు వేశారు.
అయితే థియేటర్లలో కాకుండా ఓటీటీల్లో రిలీజ్ చేస్తే భవిష్యత్లో సదరు చిత్ర నిర్మాతల సినిమాలను థియేటర్లలో ప్రదర్శించబోమనే బెదిరింపులకు థియేటర్ యాజమాన్యాలు దిగాయి. సినిమాలను ఓటీటీల్లో ప్రదర్శిస్తే థియేటర్స్పై ఆధారపడిన వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని కూడా యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. అయినప్పటికీ ఉన్న పరిస్థితుల్లో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్గా నిర్మాతలు భావించారు. ఇందులో భాగంగా ఈ బెస్ట్ ఆప్షన్ని బాలీవుడ్ బాగా ఉపయోగించుకుని 1000 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసింది. ఓటీటీల ద్వారా ఈ స్థాయిలో బిజినెస్ చేయడానికి నాంది పలికిన తొలి బాలీవుడ్ సినిమా 'గులాబో సితాబో'. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యువకథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రం అంతగా ఆదరణ పొందలేదు. అయితే ఫలితంతో సంబంధం లేకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా రైట్స్ రూపంలో అక్షరాల 65 కోట్ల రూపాయల్ని దక్కించుకుంది. అలాగే ఇదే ఓటీటీ సంస్థ విద్యాబాలన్ 'శకుంతలాదేవి' బయోపిక్కి కూడా 50 కోట్ల రూపాయలను ఇచ్చింది.
అక్షరుకుమార్ నటించిన 'లక్ష్మీబాంబ్' చిత్రానికి రూ. 125 కోట్లు, సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ నటించిన ఆఖరి చిత్రం 'దిల్ బేచారా' చిత్రానికి రూ. 50 కోట్లు, అజరుదేవగన్ నటించిన 'భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమాకి రూ. 110 కోట్లు, కునాల్ కెమ్ము నటించిన 'లూట్కేస్', విద్యుత్ జమ్వాల్ 'ఖుదాహాఫీజ్', అభిషేక్ బచ్చన్ 'ది బిగ్ బుల్', సంజరుదత్, అలియాభట్ నటించిన 'సడక్ 2' వంటి చిత్రాలకు దాదాపు 275 కోట్ల రూపాయలను రైట్స్ రూపంలో ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ సదరు చిత్ర నిర్మాతలకు అందజేసింది. ఏడు చిత్రాలను విడుదల చేసేందుకు ఈ సంస్థ ఏకంగా 570 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.
అలాగే నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ సైతం 235 కోట్ల రూపాయలతో పలు బాలీవుడ్ సినిమాల విడుదల హక్కుల్ని కైవసం చేసుకుంది. వీటిల్లో శ్రీదేవి తనయ జావ్వీ కపూర్ నటించిన 'గుంజన్ సక్సేనా' బయోపిక్ కూడా ఉంది. నేడు (బుధవారం) విడుదలవ్వబోతున్న ఈ సినిమాకి ఈ సంస్థ రూ.50 కోట్ల రూపాయలను అందజేసింది. నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే నటించిన 'రాత్ అఖేలీ హై', అభరు డియోల్ 'ఛామన్ బాహర్', సయాని గుప్తా 'యాక్స్ఒన్', అనురాగ్ కశ్యప్ యానిమేటెడ్ సినిమా 'బాంబే రోస్', సంజరుదత్ 'టోర్బాజ్', యామీ గౌతమ్ నటించిన 'గిన్ని వెడ్స్ సన్ని' వంటి తదతరల చిత్రాలను కూడా నెట్ఫ్లిక్స్ సంస్థే విడుదల హక్కుల్ని సొంతం చేసుకుంది.
నెట్ఫ్లిక్స్ మాదిరిగానే జీ5 సంస్థ సైతం 'ఘూమ్కేతు', 'చింటు కీ బర్త్డే', 'వర్జిన్ భానుప్రియ', విద్యుత్ జమ్వాల్ 'యారా', నసీరుద్దీన్షా నటించిన 'మీ రక్సమ్' వంటి తదితర చిత్రాల విడుదల కోసం 95 కోట్ల రూపాయల్ని వెచ్చించగా, రాజత్కపూర్ 'కడక్', మనోజ్ బాజ్పేరు నటించిన 'భోంస్లే' చిత్రాల విడుదల హక్కుల్ని సోనీ లైవ్ 45 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. మొత్తంగా అమోజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, జీ5, సోనీ లైవ్ ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ ద్వారా బాలీవుడ్లో దాదాపు 1050 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. దీని వల్ల సదరు చిత్రాల నిర్మాతలకు కొంత ఆర్థిక చేయూత లభించింది. అయితే వీటిల్లో కొన్ని సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మరికొన్ని త్వరలోనే రాబోతున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థి¸యేటర్లకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ వల్ల కనీసం కొంతమంది నిర్మాతలైనా ఆర్థిక భారం నుంచి తప్పించుకోగలిగారనేది వాస్తవం.
-రెడ్డి హనుమంతరావు