Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కరోనా మహమ్మారి వల్ల థియేటర్ కార్మికుల జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి. సినిమా థియేటర్లను వెంటనే తెరవాలి' అని తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ పేర్కొంది. సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ, 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలకు సడలింపులు ఇచ్చాయి.కానీ సినిమా థియేటర్లకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు. మిగతా వాటికి లేని కరోనా భయం ఒక్క సినిమా థియేటర్లకు మాత్రమే ఎందుకు వర్తిస్తుందో పాలకులు సమాధానం చెప్పాలి. థియేటర్ రంగాన్ని నమ్ముకున్న వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కరోనా కష్టకాలంలో వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలి. వెంటనే థియేటర్లను ఓపెన్ చేయాలి' అని చెప్పారు.
'లాక్డౌన్ పీరియడ్లో థియేటర్ కార్మికులకు పూర్తి వేతనాలను వెంటనే చెల్లించాలి. అలాగే సాధ్యమైనంత త్వరగా థియేటర్లను తెరవాలి. లేకపోతే థియేటర్ కార్మికుల జీవితాలు మరింత దుర్భరం అవుతాయి' అని సిఐటియు నగర అధ్యక్షులు కె.ఈశ్వర్రావు అన్నారు.
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడుతూ,'గతంలో థియేటర్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్ళాం. కాని దాదాపు మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందకపోవడం బాధాకరం.అలాగే పరిశ్రమ పెద్దలు కూడా కేవలం 24 క్రాప్ట్స్ వారికే నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. వారితోపాటు థియేటర్ కార్మికులకు కూడా ఇస్తే బాగుంటుందనే యోచన కూడా చేయడం లేదు. కనీసం ఆదుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు' అని చెప్పారు.
'థియేటర్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు. థియేటర్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ముందు ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తాం' అని సిఐటియు రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎం.మారన్న తెలిపారు.
రాష్ట్ర కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ, 'ఈ లాక్డౌన్ పీరియడ్లో థియేటర్ కార్మికులకు ప్రతి ఒక్కరికి రూ.10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం' అని చెప్పారు.
ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అరుణ్తోపాటు రాంబాబు, రవి, సురేష్, కమలాకర్ గౌడ్, రామస్వామి వీరనారాయణ, రాజు, మనోహర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.