Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దేశ వ్యాప్తంగా హిందీ చిత్ర పరిశ్రమ అగ్రస్థానంలో ఉందని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అది తప్పు. తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు వివిధ భాషల్లో పాన్ ఇండియా సినిమాలు తీసి ప్రేక్షకులకు అందిస్తోంది' అని బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ తెలుగు చిత్ర పరిశ్రమకు కితాబివ్వడం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో ఫిల్మ్సిటీ నిర్మాణం గురించి ప్రకటించారు. దేశంలోనే ఎంతో అందమైన ఫిల్మ్సిటీని త్వరలోనే నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కంగనా వరుస ట్వీట్లను పోస్ట్ చేశారు. 'దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ భాషా చిత్ర పరిశ్రమల్ని ఒక్కటి చేస్తే భారత్ ప్రపంచంలోనే అగ్ర స్థానానికి చేరుతుంది. యోగి ఆదిత్యనాథ్ జీ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నా. చిత్ర పరిశ్రమలో ఇలాంటి మార్పులు ఇంకా చాలా రావాలి. భారతదేశ చిత్ర పరిశ్రమ.. అనే ఓ పెద్ద పరిశ్రమ మనకు కావాలి. మనం ఒక్కటిగా లేకపోవడం వల్ల హాలీవుడ్ చిత్రాలు మన దేశంలోని వివిధ అంశాల్లో అవకాశాల్ని కొల్లగొడుతున్నాయి. ఒక్క చిత్ర పరిశ్రమ, అనేక ఫిల్మ్ సిటీలు కావాలి. దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే సామర్ధ్యం సినిమాలకు ఉంది. అందుకే వ్యక్తిగత గుర్తింపు ఉండి, సామూహిక గుర్తింపు లేని అనేక చిత్ర పరిశ్రమలను అఖండ భారతదేశంలా ఒక్కటి చేద్దాం' అని ప్రధాని మోడీని ఉద్దేశించి కంగనా ట్వీట్లలో పేర్కొన్నారు.