Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సీనియర్ నటి, విలక్షణ నటుడు నాగభూషణం సతీమణి పొట్నూరి సీతాదేవి (87) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం హైదరాబాద్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1946లో కె.వి.రెడ్డి. దర్శకత్వం వహించిన 'యోగి వేమన' చిత్రంతో బాలనటిగా తెరంగేట్రం చేసిన సీతాదేవి దాదాపు 200 చిత్రాల్లో భిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు. 'లవంగి', 'జయసింహ', 'పల్లెటూరి పిల్ల', 'గుణ సుందరి కథ', 'స్వర్ణ సుందరి', 'స్వప్నసుందరి', 'పరమానందయ్య శిష్యులు', 'పల్నాటి యుద్ధం', 'పంతులమ్మ', 'నలదమయంతి', 'గృహ ప్రవేశం', 'సతీ తులసి', 'అత్తా ఒకింటి కోడలే', 'సత్యహరిశ్చంద్ర' వంటి తదితర చిత్రాల్లోని పాత్రలకు విశిష్ట గుర్తింపు గుర్తింపు లభించింది. 2002లో 'నేనేరా పోలీస్' చిత్రంలో నటించిన ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. విలక్షణ నటుడు, ప్రతినాయకుడిగా విశేష గుర్తింపు పొందిన నాగభూషణాన్ని 1956లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు భువనేశ్వరి, కొడుకు సురేందర్ ఉన్నారు. భర్త నాగభూషణంతో కలిసి 'రక్త కన్నీరు', 'పాపం పండింది', 'ఇనుప తెరలు', 'అందరూ బతకాలి' వంటి నాటకాలను ఎన్నోసార్లు ప్రదర్శించారు. అటు సినీ రంగంలోను, ఇటు నాటక రంగంలోనూ తన మార్క్ నటనతో అలరించిన సీతాదేవి 'రుతురాగాలు' వంటి విజయవంతమైన ఎన్నో సీరియల్స్లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం మెప్పించారు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీతాదేవి అంత్యక్రియలు హైదరాబాద్లోని మహాప్రస్థానంలో సోమవారం సాయంత్రం ముగిశాయి.