Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదున్నర దశాబ్దాలుగా అత్యద్భుతమైన గాత్రంతో ఆబాలగోపాలాన్ని అలరించిన గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం. బాలు పాటలతో అనుబంధం లేనివారుండరంటే అతిశయోక్తి లేదు. భాష ఏదైనా సరే తన గాత్రంతో పాటకు ప్రాణం పోయడంలో ఆయనకి ఆయనే సాటి. 16 భాషల్లో 40 వేలకి పైగా పాటలు పాడిన ఘనతని దక్కించుకున్న ఏకైన నేపథ్యగాయకుడు కూడా బాలునే. బుల్లితెరపై వినూత్న కార్యక్రమాలతో ఎంతో మంది నూతన గాయనీగాయకులను వెండితెరకు పరిచయం చేసిన వారధి.
నేపథ్యగాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ప్రేక్షకలోకాన్ని మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్.పి.బాలసుబ్రమణ్యం జీవిత విశేషాలు..
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లాలోన కోనేటమ్మపేటలో జన్మించారు. సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఎస్.సి.బాలు రెండో కుమారుడు.
తండ్రి హరికథా కళాకారుడు. దీంతో ఆ వారసత్వం బాలుకి బాగా అబ్బింది. చిన్నప్పట్నుంచే పాటలు పాడటం ఆరంభించారు. తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ పాట మీద మమకారంతో పలు పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు సొంతం చేసుకున్నారు.
1963లో మద్రాస్లో సోషల్ అండ్ కల్చర్ క్లబ్ వాళ్ళు జరిపిన పాటల పోటీల్లో బాలు పాల్గొన్నారు. ఈ పోటీలో బాలు పాడిన పాటలకు న్యాయ నిర్ణేతలు పెండ్యాల, ఘంటసాల, సుసర్ల వంటి హేమాహేమీలు ముగ్ధులైపోయారు. బాలు పాటలను ముందు వరుసలో కూర్చుని విన్న సంగీత దర్శకుడు కోదండపాణికి బాగా నచ్చడంతో సినిమాల్లో పాడిస్తానని మాట ఇచ్చారు.
నటుడు, నిర్మాత పద్మనాభం 1966లో నిర్మించిన 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రం కోసం 'హరి హర నారాయణో', 'ఏమీ వింత మోహమో..' వంటి పాటలను బాలుతో పాడించి కోదండపాణి తన మాట నిలబెట్టుకున్నారు. నేపథ్య గాయకుడిగా పరిచయం అవుతూనే పి.బి.శ్రీనివాస్, పి.సుశీల వంటి దిగ్గజాలతో పాడే అవకాశాన్ని కూడా బాలు అందిపుచ్చుకున్నారు.
నటీనటుల హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా బాలు నిలవడం విశేషం. తన అద్భుత గాత్రంతో పాడిన పాటలు పండిత పామరులకు దగ్గర చేసింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తులు, ఒరియా, అస్సామీ, బదగ, సంస్కతం, కొంకణి, బెంగాలీ, మరాఠీ, పంజాబీ వంటి తదితర 16 ప్రాంతీయ భాషల్లో నేపథ్య గాయకుడిగానూ బాలు పేరొందారు.
తెలుగులో 19, తమిళంలో 19 పాటలను కేవలం 24 గంటల్లో పాడారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకులు ఆనంద్, మిలింద్ కోసం కూడా కేవలం 24 గంటల్లో 16 హిందీ పాటలు పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు బాలు. ఆ తర్వాత కూడా ప్రముఖ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకధాటిగా 17 కన్నడ పాటలు పాడిన మరో అరుదైన రికార్డ్ని బాలు సొంతం చేసుకున్నారు.
వ్యక్తిగత జీవితం
బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి కొడుకు చరణ్, కూతురు పల్లవి ఉన్నారు. ఎస్.పి.చరణ్ సైతం బాలు మాదిరిగానే మంచి నేపథ్య గాయకుడు. అలాగే నిర్మాతగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక బాలు సోదరి ఎస్.పి.శైలజ కూడా నేపథ్య గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్నాచెల్లెళ్ళు కలిసి బోల్డెన్ని పాటలు పాడటం విశేషం.
బాలుకి తండ్రిపై ఉన్న ప్రేమ ఎనలేనిది. ఆయన జ్ఞాపకార్థం నెల్లూరులోని శ్రీ కస్తూర్బా కళాక్షేత్రంలో హరికథ చెబుతున్న తీరులో ఉన్న తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అలాగే తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన సంగీత దర్శకుడు కోదండ పాణికి కృతజ్ఞతగా తన ఆడియో ల్యాబ్కు 'కోదండపాణి ఆడియో ల్యాబ్స్' అని పేరు పెట్టుకున్నారు.
డబ్బింగ్ కళాకారుడిగా..
కె. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన తమిళ అనువాద చిత్రం 'మన్మధ లీల'తో బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. అందులో కమల్ హాసన్కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తర్వాత రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ వంటి తదితర అగ్ర నటులకు పలు భాషల్లో డబ్బింగ్ చెప్పారు. కమల్ హాసన్ చిత్రాలన్నింటికి తెలుగులో బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన 'దశావతారం' చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం ఓ విశేషమైతే, ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్రకి కూడా బాలు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. 'అన్నమయ్య', 'సాయి మహిమ' చిత్రాలకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా బాలు నంది పురస్కారాలను అందుకున్నారు. దాదాపు 100 చిత్రాలకు డబ్బింగ్ చెప్పి అలరించారు.
నటుడిగా..
1969లో విడుదలైన 'పెళ్ళంటే నూరేళ్ళ పంట' చిత్రంలో నటుడిగా తొలిసారి వెండితెరపై మెరిశారు. 1990లో 'కేలడి కన్మణి' తమిళ చిత్రంలో బాలు కథానాయకుడిగా, రాధిక కథానాయికగా నటించారు. ఈ సినిమాని తెలుగులో 'ఓ పాప లాలీ'గా అనువాదం చేశారు. పక్కింటి అమ్మాయి, ప్రేమ, దొంగ దొంగ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళీ భవ, మాయాబజార్ వంటి తదితర సినిమాల్లో బాలు పోషించిన ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు ప్రేక్షకుల మదిలో సజీవంగా నిలిచాయి. 'పవిత్ర బంధం'లోని పాత్రకు, తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన 'మిథునం' సినిమాలోని నటనకు ప్రత్యేక నంది పురస్కారాలు లభించాయి.
బుల్లితెర ప్రేక్షకులనూ అలరించారు..
ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న 'పాడుతా తీయగా' కార్యక్రమంతో ఎంతో మంది నూతన గాయనీ, గాయకులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత కూడా బాలుదే. 1996లో ఆరంభమై ఇప్పటికీ విజయవంతంగా ఈ ప్రోగ్రామ్ కొనసాగటం విశేషం. 'స్వరాభిషేకం', 'ఎందరో మహానుభావులు', 'పాడాలని ఉంది', 'ఝుమ్మంది నాదం' వంటి తదితర వైవిధ్య, వినూత్న కార్యక్రమాలను నిర్వహించి భిన్న పాటలతో వీక్షకులను అలరించారు.
లెక్కకుమించిన సంగీత దర్శకులు
కోదండపాణి, కె.వి.మహదేవన్, సత్యం, సాలూరి రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, ఎం.ఎస్.విశ్వనాథన్, టి.వి.రాజు, ఘంటసాల, పెండ్యాల నాగేశ్వరరావు, పి.ఆదినారాయణరావు, టి.చలపతిరావు, రమేష్నాయుడు, కె.చక్రవర్తి, జె.వి.రాఘవులు, ఇళయరాజా, రాజ్, కోటి, హంసలేఖ, ఎం.ఎం.కీరవాణి, ఉపేంద్ర కుమార్, బప్పిలహరి, ఆర్.డి.బర్మన్, ఏ.ఆర్.రెహ్మాన్, విద్యాసాగర్, వాసురావు, శ్రీ కొమ్మినేని, వందేమాతరం శ్రీనివాస్, ఎస్.ఏ.రాజ్కుమార్, యువన్ శంకర్రాజా, స్వరవీణా పాణి, సందీప్చౌతా, మణిశర్మ, రమణ గోగుల, దేవిశ్రీ ప్రసాద్, టి.రాజేందర్, ఎం.ఎం.శ్రీలేఖ, శంకర్-ఇషాన్-లారు, ఘంటాడికృష్ణ, మాధవ పెద్ది సురేష్, చక్రి, ఆర్.పి.పట్నాయక్, హారీస్ జైరాజ్, కె.ఎం.రాధాకృష్ణ, ఆర్.నారాయణమూర్తి, జోష్వాశ్రీధర్, మిక్కీ జే మేయర్, సింగీతం శ్రీనివాసరావు, తమన్, విజరు ఆంటోని, సాకేత్ సాయిరామ్, సునీల్ కశ్యప్, అచ్చు రాజమణి, శ్రీకాంత్దేవా, కళ్యాణి మాలిక్, జి.వి.ప్రకాష్కుమార్, సాలూరి వాసురావు, చిరంతన్ భట్, శేఖర్ చంద్ర, అనిరుద్ రవిచంద్రన్, గోపీసుందర్, రఘుకుంచె వంటి తదితర సంగీత దర్శకుల సారధ్యంలో 16 భారతీయ భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సొంతం చేసుకున్న అరుదైన నేపథ్యగాయకుడిగా బాలు నిలిచారు.
సంగీత దర్శకత్వం
తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో మొత్తం 45 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వీటిల్లో 'మయూరి' చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు.
అత్యున్నత పురస్కారాలు..
భారతీయ సినిమా పరిశ్రమకు బాలు చేసిన విశిష్ట సేవలకు భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలతో సముచితంగా గౌరవించింది. 'ఓం కార నాదానుసంధానమౌ గానమే' (శంకరాభరణం, 1979), 'తేరే మేరే బీచ్ మే' (ఏక్ దూజే కేలియే, 1981), 'వేదం అణువణువున నాదం' (సాగర సంగమం, 1983), 'చెప్పాలని ఉంది.. గొంతు విప్పాలని ఉంది..' (రుద్రవీణ, 1988), 'ఉమండు ఘుమండు ఘన..' (సంగీత సాగర గానయోగి పంచాక్షర గవారు, 1995), 'తంగ తమరై..' (మిన్సార కణవు, 1996) వంటి పాటలకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ చలన చిత్ర పురస్కరాలను దక్కించుకున్నారు. 2016లో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతోపాటు ఏకంగా 25 సార్లు వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా బాలుదే కావడం విశేషం. మూడు తమిళనాడు, మూడు కర్నాటక రాష్ట్రాల అవార్డులనూ అందుకున్నారు. అలాగే ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డుతోపాటు ఎన్నో యూనివర్సీటీల డాక్టరేట్లను, ఫిల్మ్ఫేర్ అవార్డులనూ బాలు పొందారు.