Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాధికమ్మ సమర్పణలో ఎ.కె.9 ఫిలిమ్స్ పతాకంపై సాయి జస్వంత్, రేణు వర్మ హీరో, హీరోయిన్లుగా అజయ్ కౌండిన్య రచన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'చిట్టిబాబు'. పాతర్ల రామాంజనేయులు గురూజీ నిర్మిస్తున్న ప్రేమ కథా చిత్రమిది. చిత్రీకరణ అంతా పూర్తి చేస్తుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను జరుపుకుంటోందీ చిత్రం. చైతు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ఆడియోను ప్రతాని రామకష్ణగౌడ్ చేతుల మీదగా మీడియా సమక్షంలో విడుదల చేసారు. అనంతరం ప్రతాని రామకష్ణ మాట్లాడుతూ, 'పాతర్ల రామాంజనేయులుకి నా శుభాకాంక్షలు. వారు మరెన్నో మంచి మంచి సినిమాలు తీయాలి. దర్శకుడు అజయ్ కౌండిన్యకి సినిమా అంటే పిచ్చి. బతికున్నంత కాలం ఇండిస్టీలోనే ఉంటాను. సినిమాలు తీస్తానని చెప్పాడు. అంకిత భావంతో పని చేస్తాడు. త్వరలో స్టార్ డైరెక్టర్ అవుతాడు అనే నమ్మకం నాకుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. తెలంగాణ ఫిలిం చాంబర్ తరపున అన్ని విధాలా సహాయం చేస్తాను' అని చెప్పారు.
నిర్మాత పాతర్ల రామాంజనేయులు గురూజీ మాట్లాడుతూ, 'అజయ్ కౌండిన్య మంచి మిత్రుడు. 12 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఎప్పట్నుంచో కలిసి సినిమా చేదాం అనుకున్నాం. కానీ ఆ కోరిక ఇప్పుడు తీరింది. మా అబ్బాయి సాయి జస్వంత్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు. 'ఇది నా తొలి సినిమా. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు అజయ్ కౌండిన్యకి, నిర్మాత రామాంజనేయులు గురూజీ గారికి ధన్యవాదాలు' అని హీరో సాయి జస్వంత్ తెలిపారు.
దర్శకుడు అజయ్ కౌండిన్య మాట్లాడుతూ 'కేవలం 13 రోజుల్లో సినిమా చిత్రీకరణను పూర్తి చేశాం. ఈ సినిమాని చాలా చిన్న బడ్జెట్లో చేశాం. చిన్న సినిమా బతకాలి అంటే మీడియా సపోర్ట్ ఉండాలి. దయ చేసి మా సినిమాకి మంచి పబ్లిసిటీ ఇవ్వండి. సినిమాని విజయవంతం చేయండి' అని చెప్పారు.