Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ఎక్కడ, ఎలాంటి విపత్తు వచ్చినా తెలుగు చిత్ర సీమ ఆర్థికంగా స్పందిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటోంది. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్, దాని చుట్టు పరిసర ప్రాంతాల్లోని ప్రజల జీవితం అస్తవ్యస్థమైంది. చాలా మంది సొంత వాళ్లను, ఇళ్ళను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించిన పలువురు అగ్ర కథానాయకులు మానవతా దృక్పథంతో స్పందించి భారీ విరాళాలను అందజేశారు. చిరంజీవి కోటి రూపాయలు, ప్రభాస్ కోటి యాభై లక్షలు, మహేష్బాబు కోటి రూపాయలు, పవన్కళ్యాణ్ కోటి రూపాయలు, నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్ 50 లక్షలు, రామ్ 25 లక్షలు, రవితేజ 10 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షలు, హారికా హాసిని బ్యానర్ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) 10 లక్షలు, ఎన్.శంకర్ 10 లక్షలు, సంపూర్నేష్ బాబు 50 వేల రూపాయలు, దర్శకుడు త్రినాథ్ 50 వేలు..ఇలా వీరితోపాటు చాలా మంది ఎవరి స్థాయిలో వాళ్ళు బాధితులకు ఆర్థిక చేయూతనిచ్చారు. అయితే ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సరైన స్పందన రాలేదని, కోట్లకి కోట్లు సంపాదిస్తున్న అగ్రకథానాయకులు ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అనే చందాన ఉన్నారనే కామెంట్లు సోషల్ మీడియాతోపాటు పలు వెబ్సైట్లు, యూ ట్యూబ్ ఛానెళ్ళలో విస్తృతంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్కళ్యాణ్ వీటిపై ఘాటుగా స్పందించారు. 'సినిమా రంగంలోని వాళ్ళకి పేరేమో ఆకాశానికి అన్నట్లు ఉంటుంది. కానీ డబ్బు మాత్రం ఆ స్థాయిలో ఉండదు. రియల్ ఎస్టేట్ బిజినెస్లా ఇక్కడ వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండదు. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళు కనీసం పది రూపాయలు ఇవ్వడానికి మనసు రాదు. కానీ ఇలాంటి కామెంట్స్ మాత్రం చేస్తుంటారు. సినిమా వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుందనే అభిప్రాయం సాధారణ ప్రజానీకంలోనూ ఉంది. విపత్తులు జరిగినప్పుడు సినిమా పరిశ్రమ స్పందిస్తూనే ఉంది. విరాళాలు ఇస్తూనే ఉన్నారు. కానీ సరిపోయినంత ఇవ్వడం లేదనే విమర్శ కూడా ఉంది. అసలు సరిపోయినంత ఇవ్వడం లేదని నిర్ధారించేది ఎవరు?, సరిపోయినంత ఇవ్వడం లేదని నిర్ధారించే వాళ్లు వాళ్ల జేబుల నుంచి పది రూపాయలైన తీసి ఇచ్చారా?, కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బు నుంచి కోటి రూపాయలు, పది లక్షలు రూపాయలు విరాళాలుగా ఇవ్వాలంటే అలాంటివారికి మనసు ఒప్పుతుందా?, అలాంటిది నా వరకు నేను తీసుకుంటే కొన్ని కోట్లు విరాళాలు ఇచ్చాను. అలా చేయాలంటే చాలా పెద్ద మనసు కావాలి. చిత్ర పరిశ్రమలో పేరున్నంతగా డబ్బు ఉండదు. 'ఆరెంజ్' సినిమాకు నష్టం వస్తే అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే పైరసీకి గురై నెట్లో రిలీజ్ అయితే కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు. గ్యారంటీ సంతకాలు చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇన్ని కష్టనష్టాలు ఉంటాయి' అని పవన్కళ్యాణ్ తెలిపారు.