Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్దమైంది. 'అల్లుడు శ్రీను' దగ్గర్నుంచి 'రాక్షసుడు' వరకు సాయి శ్రీనివాస్ నటించిన ప్రతి సినిమా హిందీలో అనువాదమై యూట్యూబ్లో రికార్డ్ స్థాయి వ్యూస్ దక్కించుకుంటున్న నేపథ్యంలో సాయి శ్రీనివాస్ని బాలీవుడ్లోకి గ్రాండ్గా లాంచ్ చేసేందుకు ప్రముఖ ఫిల్మ్మేకర్ డా|| జయంతి లాల్గడ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కి, విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'ఛత్రపతి'. ఈ సినిమా రీమేక్తో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నారు.
'అల్లుడు శ్రీను'తో సాయిని టాలీవుడ్కి పరిచయం చేసిన డైరెక్టర్ వి.వి వినాయక్ ఇప్పుడు బాలీవుడ్కి కూడా ఇంట్రడ్యూస్ చేయడం ఓ విశేషమైతే, ఈ ఇద్దరికీ ఇది తొలి హిందీ సినిమా కావడం మరో విశేషం. పెన్ స్టూడియోస్ బ్యానర్పై డాక్టర్. జయంతిలాల్ గడ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్. జయంతిలాల్ గడ మాట్లాడుతూ, ''ఛత్రపతి' ఒక గొప్ప స్క్రిప్ట్. దాన్ని బాలీవుడ్కి తీసుకెళ్లడానికి మాకొక స్టార్ అవసరం. ఈ ప్రాజెక్ట్కి సాయి శ్రీనివాస్ పర్ఫెక్ట్ ఛాయిస్. అలాగే రీమేక్లను తెరకెక్కించడంలో వి.వి.వినాయక్ ఆయనకు ఆయనే సాటి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బాలీవుడ్ ఆడియన్స్ని దష్టిలో పెట్టుకుని ఇప్పటి జనరేషన్స్కి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ని ఎనౌన్స్ చేసిన మరుక్షణం నుంచే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి' అని చెప్పారు.
'బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు 'ఛత్రపతి' సరైన ప్రాజెక్ట్ అని నమ్ముతున్నా. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఆతతగా ఎదురు చూస్తున్నాను. పెన్ స్టూడియోస్, డాక్టర్.జయంతిలాల్తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. నన్ను టాలీవుడ్లో హీరోగా పరిచయం చేసిన వి.వి.వినాయక్ గారితో మరోసారి కలిసి పనిచేయడం ఒక గొప్ప అవకాశం. ప్రభాస్ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నా' అని కథానాయకుడు సాయి శ్రీనివాస్ అన్నారు.
వి.వి. వినాయక్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి మాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ రీమేక్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.