Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రాజావారు రాణిగారు' సినిమాతో కథానాయకుడిగా కిరణ్ అబ్బవరం మంచి పేరు తెచ్చుకున్నారు. 'రాజావారు రాణిగారు' విజయం తర్వాత 'ఎస్.ఆర్. కళ్యాణమండపం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని 'చూశారా కళ్లారా...', 'చుక్కల చున్నీ' పాటలు శ్రోతలను విశేషంగా అలరిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి.
'ఎస్.ఆర్. కళ్యాణమండపం' విడుదలకు ముందే కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమాలో నటిస్తున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తుతున్న చిత్రం 'సెబాస్టియన్ పిసి524'. ఈ సినిమా మదనపల్లిలోని సొసైటీ కాలనీ రామాలయం కల్యాణ మండపంలో బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నైట్ బ్లైండ్నెస్ (రేచీకటి) నేపథ్యంలో, సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నమ్రతా దరేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్లు. సింగిల్ షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కథానాయకుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, 'నాకు 'రాజావారు రాణిగారు' తర్వాత 'అమాయకుడు, నోట్లోంచి మాట రాదు' అనే ఇమేజ్ వచ్చింది. నటుడిగా నాకు మంచి పేరొచ్చింది. దాని తర్వాత అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ 'ఎస్.ఆర్. కళ్యాణమండపం' చేస్తున్నాను. కమర్షియల్ మీటర్ సినిమా తర్వాత ఏదైన కొత్తగా చేయాలనిపించింది. నా పాత్రకి యాక్టింగ్కి స్కోప్ ఉండాలనుకున్నాను. ఆ టైమ్లోనే బాలాజీ 'సెబాస్టియన్ పిసి 524' కథ చెప్పారు. నైట్ బ్లైండ్నెస్ మీద ఉంటుంది. ఓ కొత్త నటుడికి మూడో సినిమాకే ఇటువంటి కథ అంటే ఛాలెంజింగ్ అని చెప్పాలి. నేను ఆ ఛాలెంజ్ తీసుకున్నాను. వెరీ ఎగ్జయిటింగ్ స్టోరీ. నైట్ బ్లైండ్నెస్ అనగానే సాఫ్ట్ సినిమా అనుకోవద్దు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ సినిమా. ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాం. త్వరలో సంగీత దర్శకుడి వివరాల్ని అధికారికంగా తెలియజేస్తాం. 'ఎస్.ఆర్. కళ్యాణమండపం' విడుదలైన రెండు నెలలకు వేసవిలో ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేశాం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజ్ కె. నల్లి, కళ: కిరణ్, కూర్పు: విప్లవ్ న్యసదాం, కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.