Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పి. సునీల్కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వలస'. కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతోంది.
ఈ చిత్రం గురించి నిర్మాత యెక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ, 'కోవిడ్ లాక్డౌన్ వలన జీవనోపాధితోపాటు గత్యంతరంలేని పరిస్థితుల్లో రోడ్డున పడిన లక్షలాది వలస కార్మికుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని లాక్డౌన్ సమయంలోనే విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. చాలా కేసులు స్టడీ చేసి, వాటి ఆధారంగా రెడీ చేసిన అద్భుతమైన ఈ కథలో ఎన్నో నిజ జీవితపు పాత్రలు సజీవంగా తెరపై ఆవిష్కరించబడ్డాయి. కేవలం వలస కార్మికులు నడిచిన వందల కిలోమీటర్ల ప్రయాణంలో పడిన కష్ట, నష్టాల్నే కాకుండా, వారి జీవితాల్లోని నవ్వుల్నీ ప్రేమల్ని, మానవ సంబంధాలని హద్యంగా చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో చేశాం' అని చెప్పారు. 'నగరాలను నిర్మించిన వలస కార్మికుల్ని పరిస్థితులు అనాధలుగా వదిలేస్తే, వాళ్ళు వేసిన రోడ్లే వారిని తమ, తమ పల్లెలకు తీసుకువెళుతుంటే వారిని అక్కున చేర్చుకున్న మానవత్వం ఈ చిత్రంలోని పాత్రల్లో కనిపిస్తుంది. వారి కష్టాన్ని సైతం తమ ప్రచారాలకు వాడుకొనే పైశాచికత్వం కూడా కొన్ని పాత్రల్లో కనిపిస్తుంది' అని చెప్పారు.