Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రుధిరం రణం). ఈ చిత్రానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ని చిత్ర బృందం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. అందులో భాగంగా గురువారం ఓ కొత్త అప్డేట్ని షేర్ చేసింది. చిన్న షెడ్యూల్లో భాగంగా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లోని అందమైన పరిసరాల్లో ఎన్టీఆర్, చరణ్ల మధ్య ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు, పనులు ఏకధాటిగా సాగుతున్నాయని ట్వీట్లో చిత్ర బృందం పేర్కొంది. అంతేకాదు ఓ వీడియోని సైతం అభిమానులు, ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ వీడియోలో రోడ్డు మీద ఓ బైక్పై ఓ వ్యక్తి స్పీడ్గా వెళ్తున్న సన్నివేశాన్ని డ్రోన్ సహాయంతో చిత్రీకరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆ బైక్పై ఉన్నది ఎన్టీఆర్ లేక రామ్చరణా అనేది మాత్రం చిత్ర బృందం గోప్యంగా ఉంచింది. ఇటీవల హైదరాబాద్లో 50 రోజుల భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసి షెడ్యూల్కి ప్యాకప్ చెప్పిన విషయం విదితమే. సీతారామరాజుగా రామ్చరణ్, కొమురం భీమ్గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కథానాయిక అలియాభట్, హాలీవుడ్ కథానాయిక ఒలీవియా మోరిస్ రామ్చరణ్, ఎన్టీఆర్ సరసన మెరవబోతున్నారు. అలాగే ఐశ్వర్య రాజేష్, శ్రియ, అజయ్ దేవగన్, సముద్రకని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.