Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పొలాల్లో చెమటోచ్చి మనకు రోజూ అన్నం పెడుతున్న రైతులు ఆందోళన ప్రారంభించి ఇప్పటికి వారం రోజులైంది. దారుణమైన చలి, కరోనా వైరస్ వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ రైతులంతా కలిసి ఐకమత్యంగా పోరాడుతున్నారు. వాళ్ళ అభ్యర్థనలు విని, పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుతున్నా' అని తమిళ స్టార్ హీరో కార్తీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలకు కార్తీ మద్దతు తెలిపారు. ఆయన కొంత కాలంగా ఉళవన్ ఫౌండేషన్ ద్వారా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తున్నారు. ఇందులో భాగంగా తన వంతు ఆర్థిక సాయం అందించి, అన్నదాతల కష్టాలు తీర్చేందుకు యత్నిస్తున్నారు. ఢిల్లీ - హరియాణా మార్గంలోని సింఘు, టిక్రి రహదారులపై రైతులు శాంతియుతంగా నిర్వహిసున్న నిరసన తొమ్మిదవ రోజుకి చేరింది. వీరికి మద్దతుగా ఉళవన్ ఫౌండేషన్ తరఫున కార్తి తమిళంలో ఓ ప్రకటన విడుదల చేశారు. 'రైతులు తమ కుటుంబాల్ని, పంటల్ని, పశువుల్ని విడిచిపెట్టి మరీ పోరాడుతున్నారన్న వార్తలు దేశ ప్రజల్ని కదిలించాయి. ఇప్పటికే నీటి కొరత, ప్రకృతి వైపరీత్యాలు, పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం వంటి తదితర సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. దీనికితోడు తాజాగా ప్రకటించిన మూడు వ్యవసాయ చట్టాలు వీరిపై మరింత ప్రభావం చూపుతున్నాయి. ఈ చట్టాలు ఇప్పటికే ఆర్థికంగా దృఢంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లు, దళారులకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల బాధని అర్థం చేసుకుని వారిని ఆదుకుంటారని ఆశిస్తున్నాను' అని కార్తీ తెలిపారు.