Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. బ్యూటిఫుల్ ఎమోషన్స్ను మరింత అందంగా, ఆహ్లాదకరంగా తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కథానాయకుడు నాగ చైతన్య ఈ చిత్ర టీజర్ను ఆదివారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. 'ఈ ప్రయాణాన్ని మాలాగే మీరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం' అంటూ ట్వీట్ చేశారు. 'తమ కలల్ని నెరవేర్చుకునేందుకు, జీవితంలో అనుకున్నది సాధించేందుకు పల్లెటూర్ల నుంచి నగరానికి వచ్చిన రేవంత్, మౌనికల కథే ఈ సినిమా. కలలు వేరైనా ఈ ఇద్దరినీ ప్రేమ ఒక్కటిగా చేస్తుంది. రేవంత్, మౌనిక కలిశాక సమాజం నుంచి ఎదుర్కొన్న సమస్యలేంటి?, వాటిని అధిగమించి తమ గమ్యానికి ఈ జంట ఎలా చేరిందనే అంశాలు ఈ సినిమాలో ప్రధానాంశాలు. నాగ చైతన్య, సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడటం సినిమాలో కొత్తగా, హైలైట్గా ఉండబోతున్నాయి. ఇక టీజర్ చూస్తే, జుంబా ఇన్స్ట్రక్టర్ రేవంత్ పాత్రలో చైతూ కనిపించారు. 'జీరో కెల్లి వచ్చిన సార్.. చాన కష్టపడతా, మంచి ప్లాన్ ఉంది' అని చైతూ చెప్పిన డైలాగ్తో ఈ చిత్ర టీజర్ ప్రారంభమైంది. మౌనిక పాత్రలో సాయి పల్లవి కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే, ఇక హౌప్ లేదే అని తన స్నేహితురాలితో చెప్పిన డైలాగ్ చూపించారు. 'ఏందిరా వదిలేస్తవా నన్ను' అని మౌనిక రేవంత్ను అడగటం, ఇద్దరు కలిసి ఊరు నుంచి బయటకు పరుగెత్తుతూ వచ్చేయడం టీజర్ను ఆసక్తికరంగా మార్చింది. ఈ సినిమాలో 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకుని సూపర్ హిట్ అయిన 'ఏ పిల్లా' పాటలోని 'ఆశ నిరాశల ఉయ్యాలాటలు' అని వచ్చే బిట్తో టీజర్ పూర్తయ్యింది' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మాతలు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వరరావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు, రచన - దర్శకత్వం: శేఖర్ కమ్ముల.