Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ దర్శకుడిగా 'క్రాక్' రిలీజ్ రోజు నాకు ఎదురైన సందర్భం, పడిన బాధ వర్ణణాతీతం. ఇటువంటి పరిస్థితి ఏ దర్శకుడికీ రాకూడదని కోరుకుంటున్నా. అయితే నేను పడిన బాధని, కష్టాన్ని మరచిపోయేలా 'క్రాక్' బ్లాక్బస్టర్ సక్సెస్ చేసింది' అని దర్శకుడు మలినేని గోపీచంద్ చెప్పారు. రవితేజ, శృతిహాసన్ జంటగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్రాక్'. కరోనా వంటి విపత్కర పరిస్థితి తర్వాత ఎన్నో భారీ అంచనాలతో ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. అయితే కొన్ని కారణాల రీత్యా ఉదయం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అర్థరాత్రి షోతో ఆరంభమైంది. ప్రేక్షకుల విశేష ఆదరణతో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని దర్శకుడు గోపీచంద్ మలినేని మంగళవారం మీడియాతో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'రవితేజ కెరీర్లోనే ఆల్టైమ్ బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇది. అంతేకాదు ఆయన కెరీర్లోనే హై రేంజ్లో కలెక్షన్లను వసూలు చేసిన సినిమా కూడా. కరోనా లాక్డౌన్ వల్ల ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఒత్తిడి చాలా వచ్చింది. అయితే కథ మీద ఉన్న నమ్మకంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టాను. నా నమ్మకం ఈ రోజు నిజమైంది. ఈ సినిమాని థియేటర్లలో చూసి అందరూ ఫుల్గా ఎంజారు చేస్తున్నారు. ఇలాంటి పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాని థియేటర్లలోనే చూడాలి. కథ, స్క్రీన్ప్లేతోపాటు రవితేజ తన యాక్టింగ్తో ఈ సినిమాని నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్ళారు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు రేసీగా సాగుతూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. అందుకే ఈ సినిమాకి అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. బ్లాక్బస్టర్ హిట్తో విడుదల రోజు నేను పడిన బాధ మాయమైంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్తోపాటు పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు సినిమా అదిరిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సెన్సేషనల్ హిట్ సాధించిన 'విక్రమార్కుడు' సినిమాతో పోల్చడం, దీనికి బోనస్గా నా తనయుడు ఇందులో నటించి అందరినీ మెస్మరైజ్ చేయడం మరింత సంతోషంగా ఉంది. సంక్రాంతి బరిలో దిగిన మా సినిమాని ఆదరించి, పెద్ద హిట్ని అందుకునేలా చేసిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. త్వరలోనే దీని సీక్వెల్ గురించి, అలాగే మైత్రి మూవీ మేకర్స్లో చేయబోయే సినిమా గురించి తెలియజేస్తా' అని చెప్పారు.