Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'చెక్' ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు రాజమౌళి
నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'చెక్. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్యక్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం ఈనెల 26వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, 'ఈ సినిమాలో ఉన్న ఒక్క పాటను విన్నాను. కల్యాణీ మాలిక్ అద్భుతంగా చేశారు. ఒక్క పాట ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్తుంది. చాలా రోజులు తర్వాత థియేటర్కు వెళ్లి చూడాలని నేను ఫీలైన చిత్రమిది. చెస్ కథను నేపథ్యంగా తీసుకోవడం, సినిమా అంతా జైలులోనే తీయడం ఇంట్రెస్ట్ కలిగించింది. ఈ సినిమా కచ్చితంగా క్లాస్, మాస్ అనే హద్దులను చెరిపివేస్తుంది. వైవిధ్యమైన ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని బలంగా నమ్ముతున్నాను. నితిన్ విషయానికి వస్తే ఒకే రకమైన సినిమాల్లో నటిస్తారనే వాదనని మరిపిస్తూ చాలా కష్టపడి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి నితిన్ పెర్ఫార్మెన్స్ పరంగా నిరూపించుకుంటారు' అని చెప్పారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ,'రెండేళ్ల క్రితం నితిన్ నాకు ఈ సినిమా కథ చెప్పారు. చెక్ పై చాలా మంచి నమ్మకం పెట్టుకున్నాడు . అందుకు తగినట్టే ఈ సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది. చంద్ర శేఖర్ యేలేటి సినిమాలంటే ప్రేక్షకుల్లో, యూత్లో మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ సినిమా ఆయన కెరీర్లో పెద్ద బ్లాక్బస్టర్ అవ్వాలి' అని చెప్పారు .
'రాజమౌళిగారు తెలుగు సినిమాను ప్రపంచ పటంపై పెట్టారు. అలాంటి ఆయనతో నేను 'సై' చిత్రంలో నటించే అవకాశం దక్కింది. నా కెరీర్లో గుర్తుంచుకొనే చిత్రంగా మిగిలింది. 'సై' చిత్రం రగ్బీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. ఇప్పుడు చెక్ సినిమా క్రీడా నేపథ్యం ఉన్న చిత్రం కావడం హ్యాపీగా ఉంది. చంద్రశేఖర్ యేలేటితో ఈ సినిమా చేయడం లక్కీగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా యాక్టింగ్ ఒక లెక్క.. చెక్ తర్వాత మరోలెక్క' అని హీరో నితిన్ తెలిపారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ, 'నితిన్ ఫ్యాన్స్కు ఒక్కటే చెప్పదలచుకున్నా, ఈ సినిమా ఎవరినీ నిరాశ పరచదు' అని చెప్పారు. 'చెక్ యూనిట్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అగ్రదర్శకులు రాజమౌళికి, వరుణ్ తేజ్, గోపిచంద్ మలినేని, వెంకీ కుడుములకు ధన్యవాదాలు. నితిన్ ఎప్పటికీ గుర్తుంచుకొనే చిత్రంగా ఈ సినిమా మిగిలిపోతుంది. ఈ చిత్రంలో నటులు కాకుండా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అది మా డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి గొప్పతనం' అని నిర్మాత వి.ఆనంద ప్రసాద్ అన్నారు.