Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయి కుమార్, సిమ్రత్ కౌర్ జంటగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. టి.విజయ్ కుమార్ రెడ్డి సమర్పణలో శిఖర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా యుగంధర్ టీ (గుడివాడ యుగంధర్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్ర పూజ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్లో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగల పద్మారావు గౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత పిల్లలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సంజయ్ మెఘా, అరుంధతి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,'ఇప్పటివరకూ ఆది సాయికుమార్ తన కెరీర్లో చేయని విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ మే నుండి స్టార్ట్ చేసి సినిమాని రెండు షెడ్యూల్స్లో పూర్తి చేస్తాం. ఇది పూర్తి రోమ్ కామ్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్. ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటుంది' అని తెలిపారు. నిర్మాత యుగంధర్ మాట్లాడుతూ, 'మా బ్యానర్ పై మరిన్ని చిత్రాలు వస్తాయి. ప్రతి చిత్రం నుండి వచ్చిన డబ్బులో కొంత భాగం పేద విద్యార్థులకు ఉపయోగిస్తాను' అని చెప్పారు.
'మంచి కంటెంట్ ఉన్న కథ. ఇది కంప్లీట్ ఎంటర్టైనర్' అని హీరో ఆది సాయికుమార్ చెప్పారు. 'కథ చాలా బాగుంది. ఇలాంటి మంచి కథలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని సిమ్రత్ కౌర్ తెలిపారు.