Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ రవి హీరోగా ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూతురు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కోరమీను'. 'స్టోరీ ఆఫ్ ఇగోస్' అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకుడు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా శనివారం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ కొన్ని రోజుల నుంచి వినూత్నంగా సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీజర్లో ఆ మీసాలు రాజు ఎవరో చెప్పారు. 'ఈ రోజు జాయిన్ అయిన మీసాల రాజు గారికి జాలరిపేటలో నిన్న రాత్రి ఎవరో మీసాలు తీసేశారని సమాచారం' అని న్యూస్ యాంకర్ వాయిస్ వినిపిస్తుంటే... స్క్రీన్ మీద మీసాల రాజుగా శత్రును చూపించారు. 'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ అసలైన పవర్ భయానిదేరా' అని హరీష్ ఉత్తమన్ చెప్పే డైలాగ్, 'ఇది జాలరిపేట. డబ్బున్నోడు, డబ్బు లేనోడు... అంతే!' అని హీరోయిన్ కిషోరీతో ఆనంద్ రవి చెప్పే మాట, వాళ్ళ క్యారెక్టరైజేషన్లు చెప్పేలా ఉన్నాయి. టీజర్ చివర్లో గిరిధర్, ఇమ్మాన్యుయేల్ సీన్తో సినిమాలో కామెడీ కూడా ఉందని హింట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ, 'జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరం. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్లో శక్తివంతమైన పోలీసు - ఈ ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్తో వస్తున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది' అని అన్నారు. ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోరీ దత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్, ఆర్కే నాయుడు నటిస్తున్నారు.