Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాల సంచలన దర్శకుడిగా పరిశ్రమలో ఓ స్పెషల్ బ్రాండ్ని, ప్రేక్షకులతో స్పెషల్ బాండ్ని క్రియేట్ చేసుకున్న ఘనత ఒక్క వి.వి.వినాయక్కే దక్కిందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రొటీన్ కథల మూస ధోరణిలో వెళ్తున్న తెలుగు సినిమా గమనాన్ని 'ఆది' వంటి ఒకే ఒక్క బ్లాక్బస్టర్ హిట్తో మార్చేసిన క్రెడిట్ కూడా ఆయనదే. తొలి చిత్రం సాధించిన సంచలన విజయంతోనే అగ్రదర్శకుడి కేటగిరిలోకి ఎంట్రీ ఇచ్చిన వినాయక్ ఆ తర్వాత సైతం అదే పంథాలో పయనిస్తూ మరిన్ని విజయాల్ని సాధించారు. అంతేకాదు ఆయన దర్శకత్వానికి రెండు వైపులా పదునుందని అటు అగ్రహీరోలతోను, ఇటు నూతన హీరోలతో చేసిన సినిమాలు సాధించిన హిట్లతో నిరూపించుకున్నారు. ఎదుగుతున్న కొద్ది ఒదిగే గుణానికి ప్రతీకగా స్ఫూర్తిదాయక విజయ పయనానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన వి.వి.వినాయక్ పుట్టినరోజు నేడు (శుక్రవారం).
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని వి.వి.వినాయక్ గురించి 'నవచిత్రం' పాఠకులకు ప్రత్యేకం..
ఆ కష్టాలు నేను పడద్దొనే...
ఈస్ట్గోదావరిలోని నా స్వస్థలమైన చాగల్లులో మాకొక థియేటర్ ఉండేది. నేను పుట్టిన తర్వాత ఆ థియేటర్కి 'వీర వెంకట వినాయక టాకీస్' అని నాన్నగారు పేరు మార్చారు. అప్పటికి ఇంకా టెలివిజన్ రంగం అంతగా పాపులర్ అవ్వలేదు. దీంతో థియేటర్ బాగా రన్ అయి, మరో నాలుగైదు థియేటర్లు కొనే స్థాయికి నాన్నగారు ఎదిగారు. అంతా బాగానే ఉందనుకునే తరుణంలో ఇళ్ళల్లోకి టీవీలొచ్చి థియేటర్ బిజినెస్ మీద ప్రభావం బాగా చూపించింది. థియేటర్ బిజినెస్లో బాగా దెబ్బతిన్నాం. అదే టైంలో నేను సినిమాల్లోకి వెళ్ళాలనుకుని నా నిర్ణయాన్ని నాన్నగారికి చెప్పాను. ఆయన ససేమిరా అన్నారు. నేను పడిన కష్టం నువ్వు పడకూడదురా..అని వారించినప్పటికీ నిలదొక్కుకోగలననే ధృడ సంకల్పంతో సినిమాల్లోకి వచ్చేశా.
మలుపు తిప్పిన దర్శకుడు సాగర్ పరిచయం..
నా మొండితనాన్ని గమనించిన నాన్నగారు అప్పటికే పాపులరైన దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణకు పరిచయం చేశారు. అప్పుడాయన 'అబ్బాయిగారు' సినిమా చేస్తున్నారు. తర్వాత చెన్నైకి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా పని కోసం వెతకటం స్టార్ట్ చేశా. చెన్నైలోనే నేను ఉండే వీధిలోనే దర్శకుడు సాగర్గారు ఉండేవారు. ఆయనకు సహాయ దర్శకుడిగా పని చేసే అవకాశం కలిగింది. ఆయనతో నేను చేసిన తొలి సినిమా 'సాగర సంచలనం'. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత కృష్ణగారితో సాగర్గారు 'అమ్మదొంగ' చిత్రాన్ని తీశారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. దీని తర్వాత ఆయన దగ్గర చాలా చిత్రాలకు పని చేశాను. ఆ తర్వాత దర్శకుడు క్రాంతి కుమార్ దర్శకత్వంలో రూపొందిన '9నెలలు', 'పాడుతా తీయగా' చిత్రాలకు, ఎస్వీకృష్ణారెడ్డి తెరకెక్కించిన 'సకుటుంబ సపరివార సమేతంగా' చిత్రాలకు కూడా దర్శకత్వ శాఖలో పని చేశాను.
పదివేల అడ్వాన్స్..
ఈ క్రమంలో కూచిపూడి వెంకట్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ 'వర్మగారు బేవార్స్గాడు' అనే చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నాళ్ళకు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ సినిమాకి పని చేస్తున్న క్రమంలో నా క్రమశిక్షణ, పనిపట్ల నా డెడికేషన్ చూసి 'నిన్ను నేనే డైరెక్టర్ని చేస్తా' అంటూ పదివేల రూపాయల్ని అడ్వాన్స్గా బెల్లంకొండ సురేష్ ఇచ్చారు. ఓ మనిషిని నమ్మితే ఆయనెంత దూరం వరకు వెళ్తారని ప్రత్యక్షంగా చూశా. చాలా సంతోషమనిపించింది.
'ఆది'కి అలా పునాది పడింది..
ఇదే బ్యానర్లో రూపొందిన 'చెప్పాలని ఉంది' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నల్ల మలుపు బుజ్జి చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఆ సినిమా పాటల షూటింగ్ కోసం స్విట్జ ర్లాండ్ వెళ్ళాం. అక్కడ ఆయనకు ఓ లవ్స్టోరీ వినిపించా. కథ విని ఆయనెంతో ఎగ్జైట్ అయ్యారు. అదే టైంలో 'స్టూడెంట్ నెం.1' చిత్రంలోని పాటల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ కూడా స్విట్జర్లాండ్లో ఉన్నాడు. ఎన్టీఆర్కు కథ చెప్పించేందుకు బుజ్జి ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ 20 నిమిషాల్లో కథ చెప్పమని అడిగారు. కథ విని.. ఆయన కూడా చాలా ఎగ్జైట్గా ఫీలయ్యాడు. సినిమా చేస్తున్నా మని చెప్పాడు.చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇండియాకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్తో కొడాలినాని
ఓ యాక్షన్ సినిమా చేయాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్సయ్యారు. కథ ఓకే అయ్యిందనే ఆనందం ఫట్మని ఎగిరిపోయింది. వారం రోజుల్లో అలాంటి కథతో వస్తానని చెప్పి బయటికి వచ్చా. ఎలాంటి కథ చేయాలి.. ఎలాంటిది చెబితే వీళ్ళకి నచ్చుతుందనే గందరగోళంతో నా మనసు మనసులో లేదు. యాక్షన్కి సంబంధించి అప్పటికి నా మైండ్లో రెండే రెండు సీన్లు ఉన్నాయి. ఓ బుడ్డోడు బాంబు విసిరేస్తాడనేది ఒకటైతే, మరొకటి సుమోలు బ్లాస్ట్.. ఈ రెండు సీన్లని బేస్ చేసుకుని రెండు రోజుల్లో 60 సీన్లు రాశా. ప్రాణం పెట్టి స్క్రిప్ట్ ప్రిపేర్ చేశా. కథ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్కి పర్సనల్ అసోసియేట్స్ అయిన ప్రసాద్, శ్రీధర్లకు కథ నెరేట్ చేశా. వాళ్ళు కథ అదిరిపోయిందన్నారు. అంతే.. నాలో ఎక్కడిలేని ఉత్సాహం.
ఆ ఉత్సాహంతోనే నానిగారికి కథ చెప్పా.. ఆ తర్వాత అది 'ఆది' రూపంలో బ్లాక్బస్లర్గా నిలిచి దర్శకుడిగా నాకు, హీరోగా ఎన్టీఆర్కు స్టార్డమ్ తీసుకొచ్చింది' అని వినాయక్ పలు సందర్భాల్లో మీడియాకి చెప్పారు.
సంచలన పరంపర..
'ఆది' సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణతో 'చెన్నకేశవరెడ్డి' చిత్రం చేసి విజయం సాధించారు. హీరో నితిన్తో రూపొందించిన 'దిల్' సినిమా సూపర్హిట్ కావడంతో వినాయక్తో సినిమాలు చేయాలని హీరోలందరూ ఎదురు చూశారు. 'దిల్' సినిమాతో డిస్ట్రిబ్యూటర్ రాజు ఏకంగా సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని దిల్రాజుగా మారిపోయారంటే సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అర్థం చేసుకోవచ్చు. నాలుగో సినిమాకి అగ్రకథానాయకుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు వినాయక్. 'ఇంద్ర' తర్వాత చిరంజీవి చేస్తున్న 'ఠాగూర్' సినిమాపై ఎంత భారీ అంచనాలుంటాయో ఉహించిన వినాయక్ అభిమానులు కోరుకునే విధంగా సినిమాని రూపొందించి సూపర్ డూపర్ హిట్ సాధించారు. ఎన్టీఆర్తో మరోసారి జత కట్టి 'సాంబ' చిత్రాన్ని రూపొందించి సక్సెస్ కొట్టారు. తర్వాత అల్లుఅర్జున్తో చేసిన 'బన్ని'చిత్రం సైతం సూపర్హిట్టయ్యింది. వెంకటేష్ను ఫ్యామిలీ హీరోగా చూపిస్తూనే తనదైన మాస్ స్టయిల్లో 'లక్ష్మీ'గా ఆవిష్కరించి మరో సూపర్హిట్ సొంతం చేసుకున్నారు. అప్పటి వరకు పూర్తి యాక్షన్ అండ్ మాస్ సినిమాలను రూపొందించిన వినాయక్ పంథా మార్చి రవితేజతో 'కృష్ణ' వంటి యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందించి సూపర్ సక్సెస్ కొట్టి సరికొత్త ఫార్ములాను పరిచయం చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన మరో యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'అదుర్స్'లో యంగ్టైగర్ను కొత్త లుక్లో చూపించి విజయబావుటా ఎగురవేశారు. బన్నీతో 'బద్రినాథ్' తర్వాత, రామ్చరణ్తో కోల్కత్తా బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన 'నాయక్' చరణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ను సాధించి సరికొత్త విజయాన్ని సాధించింది. టాప్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన వినాయక్ తర్వాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ను హీరోగా పరిచయం చేస్తూ 'అల్లుడుశీను'తో మరో హిట్ కొట్టారు. తాజాగా అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ని హీరోగా పరిచయం చేస్తూ 'అఖిల్' చిత్రాన్ని డైరెక్ట్ చేసి మరో వారసుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. నిర్మాతల దర్శకుడిగా అన్నింటికి మించి మంచి మనసున్న మనిషిగా పేరొందిన వినాయక్ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. చిరంజీవి 150వ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే 'ఠాగూర్'వంటి మెగా బ్లాక్బస్టర్ను ప్రేక్షకులకు అందివ్వాలని పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు వినాయక్కు 'నవచిత్రం' ఆల్ ద బెస్ట్ చెబుతోంది.