Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంధత్వాన్ని జయించి ట్రెండ్కి అనుగుణంగా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సంగీతంతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్రజైన్(71) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. సంగీత దర్శకుడిగా ఆయన సినీ ప్రస్థానం అందరికీ మార్గదర్శకం. హార్మోనియం వాయించడంలో స్పెషలిస్ట్గా పేరొందిన రవీంద్రన్ జైన్ తొలుత సంగీత దర్శకత్వం వహించిన 'చోర్ మచాయే షోర్' (1974) సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత 'గీత్ గాతా ఛల్' (1975), 'చిచ్చోర్' (1976) చిత్రాలు సైతం ఘనవిజయం సాధించాయి. దీంతో రవీంద్రజైన్కు బాలీవుడ్లో మరింత గుర్తింపు లభించింది. సంగీత దర్శకత్వంతోపాటు పాటలు రాయడం, పాడటం ఆయన ప్రత్యేకత. రాజ్కపూర్ నటించిన 'రామ్ తేరీ గంగా మెయిలీ' చిత్రంతో రవీంద్ర జైన్ యావత్ భారతీయ ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. ఆ తర్వాత హిందీతోపాటు పంజాబీ, వరియా, భోజ్పురి, తెలుగు, మలయాళం, బెంగాలీ, గుజరాతీ తదితర భాషా చిత్రాలకు కూడా ఆయన సంగీతమందించి ప్రత్యేకతను చాటుకున్నారు. వీటితోపాటు భక్తిపాటలకు సంబంధించి లెక్కలేనన్ని ఆల్బమ్స్కు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో 'బ్రహ్మశ్రీ విశ్వామిత్ర', 'దాసి' చిత్రాలకు కూడా ఆయన సంగీతమందించారు.
జేసుదాసుని బాలీవుడ్కి పరిచయం ఘనత
ప్రముఖ నేపథ్యగాయకుడు జేసుదాసుని బాలీవుడ్కి పరిచయం చేసిన ఘనత కూడా రవీంద్రజైన్దే. 1970 నుంచి 80 మధ్యకాలంలో రవీంద్రజైన్ సంగీత దర్శకత్వం వహించిన చాలా చిత్రాల్లో జేసుదాసు పాటలు పాడారు. వీరిద్దరి కాంబినేషన్లో 'ఓ గోరియా రే..', 'బీత్ హుయి రాత్ కి', 'గోరీ తేరా గావ్..' వంటి పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. అంతేకాదు కె.జె.జేసుదాసు స్థాపించిన 'తరంగిణి ఆడియో' కంపెనీ ద్వారా మలయాళంలో ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్కు రవీంద్రజైన్ సంగీతాన్ని సమకూర్చారు. ముఖ్యంగా వీరి కాంబినేషన్లో వచ్చిన భజన్స్ అందరిని విశేషంగా అలరించాయి. వీటితోపాటు గజల్స్తో కూడా ఆల్బమ్స్ రూపొందించారు.
అంధత్వాన్ని జయించిన ఘనుడు..
లక్ష్యాన్ని సాధించడంలో అంధత్వం అడ్డుకాదని నిరూపించిన ఘనుడు రవీంద్రజైన్. సినిమాకే పరిమితం కాకుండా లెక్కలేనన్ని టీవీ సీరియల్స్కి కూడా ఆయన సంగీతాన్ని సమకూర్చారు. 'రామాయణం' సీరియల్తో మరింత గుర్తింపు వచ్చింది. 1985లో 'రామ్ తేరీ గంగా మెయిలీ' చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును, అలాగే 1976 'చిచ్చోర్' చిత్రానికి, 1991లో 'హెన్నా' చిత్రానికి సైతం ఆయన ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులను గెల్చుకున్నారు. సంగీత ప్రపంచంలో ఆయన చేసిన విశేష సేవల్ని గుర్తించి ఈ ఏడాది కేంద్రప్రభుత్వం 'పద్మశ్రీ' అవార్డ్తో సముచితంగా గౌరవించింది.