Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణం గా నిరాశ్రయులైన చెన్నై వరద బాధితుల సహాయార్థం 'మా' (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) తరఫున ఐదు లక్షల విరాళం ఇస్తున్నట్లు 'మా' అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.
శనివారం ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, 'తెలుగు చిత్ర పరిశ్రమకు చెన్నై తల్లిలాంటింది. మా బతుకులు ప్రారంభమయ్యింది చెన్నైలోనే.
ఇప్పుడు చెన్నై ఉన్న పరిస్థితి, అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. వారిని ఆదుకునేందుకు ఇప్పటికే 'మా' బిడ్డల్లాంటి హీరోలు స్పందించి తమకు తోచిన విధంగా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇండిస్టీ అంతా స్పందించి ఆపన్న హస్తం ఇవ్వడానికి కారణం ఆనాటి సినీ పెద్దలు ఇచ్చిన స్ఫూర్తే. గతంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పెద్దలు జోలే పట్టి ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. వారు నేర్పిన పద్ధతిలోనే మేం కూడా ప్రయాణిస్తున్నాం. గతేడాది వైజాగ్లో వరదల వల్ల ఇలాంటి పరిస్థితే తలెత్తితే 'మేముసైతం' అనే కార్యక్రమం ద్వారా విరాళం సేకరించి 'మా' వంతు సాయం అందజేశాం. ఇప్పుడు చెన్నై ప్రజలను ఆదుకునేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రస్తుతం తమిళనాడులో మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాక 'మా' తరఫునుంచి ప్రత్యక్షంగా చెన్నై ప్రజలను ఆదుకునేందుకు తమిళనాడు నడిగర్ సంఘంతో కలిసి పనిచేస్తాం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో 'మా' కార్యదర్శి శివాజీ రాజా ఏడిద శ్రీరాం, శశాంక్, హరినాథ్ పాల్గొన్నారు.