Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మిగతా ఇండిస్టీలతో పోల్చితే తెలుగు పాటలు ఒక వేడుకలా ఉంటాయి. అందుకే టాలీవుడ్లో మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంద'ని అంటున్నారు సంగీత దర్శకుడు జిబ్రాన్. 'రన్ రాజా రన్', 'జిల్', 'ఉత్తమ విలన్', 'చీకటి రాజ్యం' వంటి సినిమాలకు అందించిన సంగీతంతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస సినిమాలకు సంగీతమందిస్తూ బిజీగా ఉన్న జిబ్రాన్ త్వరలోనే చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'గతేడాది 'జిల్', 'ఉత్తమ విలన్', 'చీకటి రాజ్యం' వంటి సినిమాల సక్సెస్తో ఈ ఏడాది మరిన్ని సినిమాలు చేయబోతున్నాను. ఇప్పటికే తెలుగులో వెంకటేష్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న 'బాబు బంగారం' చిత్రానికి సంగీతమందిస్తున్నాను. ఇది రొమాంటిక్ ఆల్బమ్. 'జిల్', 'రన్ రాజా రన్'తో పోల్చితే కొద్దిగా మాస్ టచ్తో ఉంటుంది. ఈ చిత్రానికి కొన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాం. ట్యూన్స్ విని అద్భుతంగా చేశావని మారుతి ప్రశంసించారు. వెంకటేష్గారి సినిమాకు సంగీతమందించడమంటే భయమేసింది. ఓ పార్టీలో కమల్హాసన్గారు నన్ను వెంకటేష్గారికి పరిచయం చేశారు. ఆయన నన్ను హగ్ చేసుకుని బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్లో రూపొందే చిత్రానికి కూడా స్వరాల్ని సమకూరుస్తున్నాను. రాజస్థానికి చెందిన కొన్ని సాంప్రదాయ సంగీత వాయిద్యాలను, అంతర్జాతీయ సంగీత పరికరాలను కూడా ఈ చిత్రానికి ఉపయోగిస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక గ్లోబల్ ఆల్బమ్. దీంతోపాటు తమిళంలో విక్రమ్ హీరోగా మా అన్నయ్య అమిద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాకు, జ్యోతిక ప్రధాన పాత్రధారిణిగా తెరకెక్కనున్న మరో చిత్రానికి, అలాగే ఊల్ఫ్ బేస్డ్గా రూపొందుతున్న ఇంకొక చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాను. హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడంతోపాటు మ్యూజిక్ స్టూడియో కూడా ఏర్పాటు చేస్తున్నాను. సంగీత ప్రపంచంలో మెలోడి ట్యూన్స్ చేస్తేనే త్వరగా గుర్తింపు సాధించగలం. మన మార్కు ఏంటనేది అందులోనే బాగా నిరూపించుకోవచ్చు. వాటికి ఎక్కడైనా ఆదరణ ఉంటుంది' అని అన్నారు.