Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి' చిత్రానికి భయపడి మా 'శ్రీమంతుడు' చిత్రం విడుదలని వాయిదా వేయలేదు. సోలోగా విడుదల కావాల్సిన అర్హత 'బాహుబలి' చిత్రానికి ఉంద'ని మహేష్బాబు చెప్పారు. 'శ్రీమంతుడు' చిత్రం జూలై 17న విడుదలవ్వాల్సి ఉంది. అయితే 'బాహుబలి' జూలై 10న విడుదలవుతుండటంతో ఆగస్ట్ 7న 'శ్రీమంతుడు' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 'శ్రీమంతుడు' విడుదల తేదీ మారిన నేపథ్యంలో వస్తున్న పలు కామెంట్స్కు మహేష్బాబు స్పందించారు. 'ఒక పెద్ద సినిమా విడుదలవుతున్నప్పుడు రెండు మూడు వారాల తర్వాతే మరో సినిమా విడుదల కావడం ఆరోగ్యకరం. అందుకే మా 'శ్రీమంతుడు' చిత్రం విడుదల తేదీని మార్చాల్సి వచ్చింది. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ 'బాహుబలి'ని చూసి గర్వపడాలి. ఈ సినిమా విజయం సాధించడం తెలుగు సినీ పరిశ్రమకు కీలకం. 'బాహుబలి' బ్లాక్బస్టర్ హిట్ అవ్వాలని అందరమూ ప్రార్థించాలి' అని గురువారం హైదరాబాద్లో ఓ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్బాబు మీడియాతో అన్నారు. గత రెండు నెలలుగా 'బాహుబలి' చిత్రం గురించి ఏదో రూపంలో వార్తలు, పబ్లిసిటీ వస్తూనే ఉంది. తెలుగులో ఇప్పటికే 'బాహుబలి' ఆడియో విడుదలైంది. రెండు రోజుల క్రితం తమిళంలో ఆడియో విడుదలైంది. ఈ శనివారం మళయాళంలో ఆడియోను విడుదల చేస్తున్నారు. దీంతోపాటు ఈ చిత్రంలో ఉపయోగించిన వస్తువులు, దుస్తులు, కళారూపాల్ని ఇప్పటికే ఆన్లైన్లో అమ్మకానికి కూడా పెట్టారు. అలాగే చిత్రంలో నటించిన ప్రధాన తారాగణం ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు టాలీవుడ్ నుంచి మొదలు పెట్టి బాలీవుడ్ వరకు ప్రమోషన్ టూర్తో బిజీగా ఉండటం విశేషం.