Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెస్సిబియన్ల జీవితాల నేపథ్యంలో రూపొందిన 'అన్ ఫ్రీడమ్' చిత్రం ప్రదర్శనను మన భారతదేశంలో నిషేధించారు. పలు వివాదాల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఇటీవల పువారు ఐఐటి విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. దాదాపు 500 మంది విద్యార్థుల ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం దర్శక,నిర్మాత రాజ్ అమిత్ కుమార్ మాట్లాడుతూ, 'గత సంవత్సరం ముంబైలో జరిగిన క్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ చిత్రం ప్రదర్శితమై, వీక్షకుల ప్రశంసలు పొందింది. అటువంటి చిత్రాన్ని మన సెన్సార్ బోర్డ్ థియేటర్లలో ప్రదర్శనకు అనుమతివ్వకపోవడం బాధాకరం. ఈ చిత్రాన్ని చూసిన దాదాపు 500 మంది ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు సైతం సెన్సార్ విధానాన్ని తప్పుబట్టడం విశేషం. సమాజంలో లెస్బియన్ల పాత్ర, వారి మానసిక పరిస్థితులు, వారి సమస్యలు తదితర అంశాలను చాలా సున్నితంగా తెరకెక్కించారని విద్యార్థులు ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. ఒక్క భారతదేశంలో మినహా ఈ చిత్రాన్ని ఇప్పటికి యుఎస్, యుకేల్లో విడుదల చేశాం. విడుదలైన ప్రతి చోటా విశేష స్పందన లభిస్తోంది. భారతదేశంలో ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని మళ్ళీ సెన్సార్ బోర్డ్ని, కేంద్రప్రభుత్వాన్ని కోరతాం. మా చిత్రం తరహాలోనే చాలా చిత్రాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థంకాని పరిస్థితిలో దర్శక,నిర్మాతలున్నారు. ఏదిఏమైనా ఓ ఆరోగ్యకరమైన విధానాన్ని ఇప్పటికైనా సెన్సార్బోర్డ్ అమలు చేయాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. న్యూయార్క్ నటి ప్రీతి గుప్తా ప్రధాన పాత్రధారిణిగా 'అన్ ఫ్రీడమ్' చిత్రాన్ని రాజ్ అమిత్ కుమార్ నిర్మించారు.
ఓ సినిమా ప్రదర్శనను కేంద్ర సెన్సార్ బోర్డ్ ఎందుకు నిలిపివేస్తుంది? అనే ఒక్క ప్రశ్నకు చాలా సమాధానాలు ఉన్నాయి. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమనే విషయాన్ని పక్కదోవ పట్టించి తప్పు దారిలో నడిపించే ఏ చిత్రాన్నైనా కేంద్ర సెన్సార్ బోర్డ్ ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తుంది. అయితే సెన్సార్బోర్డ్ బ్యాన్కి గురైన ప్రతి సినిమా ఇలాగే ఉంటుందని చెప్పడం కూడా సమంజసం కాదు. ఒక్కోసారి ఆయా సందర్భాల్లో ఆయా చిత్రాలు, ఆయా దర్శక, నిర్మాతలపై సెన్సార్బోర్డ్ సభ్యులకు సదభిప్రాయం లేనప్పుడు సైతం బ్యాన్కి గురైన సందర్భాలెన్నో ఉన్నాయి. ఈ తరహా చిత్రాలు ఆ తర్వాత కాలంలో విడుదలై సంచలన విజయం సాధించిన దాఖలాలూ ఉన్నాయి. అలాంటి వాటికి 'బ్యాండిట్ క్వీన్', 'వాటర్', 'ఫైర్', 'కామసూత్ర' వంటి చిత్రాలు ప్రత్యక్ష ఉదాహారణగా నిలుస్తాయి. అతి త్వరగా ఆకర్షించే సినిమా ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుంది. సినిమాలు ఏం చెబుతున్నాయి ? వాటి అంతిమ లక్ష్యం ఏంటనే ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకనప్పుడు సెన్సార్బోర్డ్ నిర్దాక్షిణ్యంగా బ్యాన్ విధిస్తుంది. ఆయా చిత్రాల్లో కొన్ని సందేశం ఇచ్చేవిగా ఉన్నా ప్రజల మనోభావాలు దెబ్బతీసే అంశాలున్నాయని భావించిన సందర్భంలో సైతం బ్యాన్ చేస్తుంది.
ఇటీవల 'అన్ఫ్రీడమ్' చిత్రాన్ని పై కారణాలతోనే సెన్సార్బోర్డ్ బ్యాన్ చేసింది. ముస్లిం టెర్రరిజం నేపథ్యంలో స్వలింగ సంపర్కులైన ప్రేమికుల కథతో హిందీలో రూపొందిన 'అన్ఫ్రీడమ్' చిత్రాన్ని కేంద్ర సెన్సార్బోర్డ్ బ్యాన్ చేసింది. ప్రవాస భారతీయుడు దర్శకుడు రాజ్ అమిత్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వ్యక్తుల మధ్య అసహజమైన కోరికలు సృష్టించేదిగా ఉందనే అభిప్రాయంతో సెన్సార్ బోర్డ్ ఈ చిత్రం ప్రదర్శనను నిలిపివేశారు. అలాగే సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మస్తీజాదే' కూడా బ్యాన్కు గురయ్యింది. వల్గారిటీ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆడ, మగ శరీరాలను అభ్యంతరకరంగా చూపించడం, భావ వ్యక్తీకరణ పేరుతో ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించడమే ఈ చిత్రం అంతిమ లక్ష్యమని కోర్టు చెబుతూ, విడుదలను నిలిపివేయాలని సెన్సార్ బోర్డ్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహాలో కేంద్ర సెన్సార్ బోర్డ్ బ్యాన్కు గురైన మరికొన్ని భారతీయ సినిమాల గురించి 'నవచిత్రం' పాఠకులకు ప్రత్యేకం..
డాజెడ్ ఇన్ డూన్
కోల్కతాకు చెందిన దర్శకుడు అశ్విన్ కుమార్ డైరెెక్షన్లో ఇంగ్లీష్ భాషలో (2010) రూపొందిన ఇండో-అమెరికన్ చిత్రమిది. ప్రతిష్టాత్మక డూన్ స్కూళ్లను తక్కువ చేసి చూపడంతో ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసింది.
అన్షాహల్లా ఫుట్బాల్
తన తండ్రి వలే ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొం టున్న ఒక కాశ్మీర్ కుర్రాడు దేశమంతటా ట్రావెల్ చేయడమనే ఇతివృత్తంతో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో (2010) రూపొందిన కాశ్మీర్ చిత్ర మిది. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధం గా ఉండడం, ఇదొక సున్నితమైన అంశంగా భావించి సెన్సార్ బోర్డ్ విడుదలను నిలిపివేసింది.
గాండు
క్యూ దర్శకతంలో బెంగాలీ భాషలో 2010లో తెరకెక్కిన ఈ చిత్రంలో నోటితో శృంగారం, మితిమీరిన అశ్లీల సన్నివేశాలున్నాయని సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసింది.
ఫిరాఖ్
2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో నందితా దాస్ దర్శకత్వంలో (2008) రూపొందిన ఈ బాలీవుడ్ చిత్రం మొదట బ్యాన్కు గురయ్యింది. ఏడాది తర్వాత విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. రెండు జాతీయ అవార్డులతో పాటు పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై అనేక అవార్డులను సొంతం చేసుకుంది.
వాటర్
అనురాగ్ కశ్యప్ రాసిన కథ ఆధారంగా దీపా మెహతా దర్శకత్వం(2005)లో తెరకెక్కిన ఈ చిత్రం స్త్రీలను ద్వేషించడం, విధవలను హీనంగా చూపడ మనే వివాదస్పద ఇతివృత్తంతో ఉండడంతో సెన్సార్ బోర్డ్ సినిమా విడుదలను నిలిపివేసింది.
పార్జానియా
2002లో గుజరాత్ అల్లర్లలో ఒక బాలుడు తప్పిపోవడమనే ఇతివృత్తంతో రాహుల్ డోలాకియా దర్శకత్వం(2005)లో రూపొందిన ఈ గుజరాతీ చిత్రాన్ని నిలిపి వేయాలని పలు రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవడంతో విడుదలను బ్యాన్ చేశారు. మతపరమైన సున్నితమైన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు దర్శక,నిర్మాతల రెండేళ్ల పోరాటం తర్వాత 2007లో విడుదలైంది. విశేషప్రేక్షకాదరణతోపాటు గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై
విమర్శకుల ప్రశంసల్ని సైతం పొందింది. అలాగే కలెక్షన్ల వసూళ్ళ పరంగా కూడా రికార్డ్ సృష్టించింది.
సిన్స్
కేరళలోని క్యాథలిక్కు చెందిన పూజారి ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆమెతో శృంగార జీవితం గడపడమనే ఇతివృత్తంతో వినోద్ పాండే దర్శకత్వం (2005)లో తెరకెక్కిన
ఈ చిత్రం క్యాథలిక్లను కించపర్చడం, తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ క్యాథలిక్లు గొడవ చేయడంతో సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసింది. కొన్నికట్స్తో ఆ తర్వాత విడుదలైంది.
బ్లాక్ ఫ్రైడే
ముంబరు బాంబు పేలుళ్ళ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం(2003)లో రూపొందిన ఈ బాలీవుడ్ చిత్రంపై కేంద్ర సెన్సార్ బోర్డ్ బ్యాన్ విధించింది.బాంబ్ బ్లాస్ట్ప్ కేసు కోర్టులో ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం సరైనది కాదని బ్యాన్ చేసింది.
పాంచ్
1997లో జరిగిన జోషి, అభ్యాంకర్ వరుస హత్యల నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం(2004)లో తెరకెక్కిన ఈ బాలీవుడ్ చిత్రంలో మితిమీరిన హింస, డ్రగ్స్ వాడకం, సెక్స్ వంటి అంశాలున్నాయని సెన్సార్ బోర్డ్ బ్యాన్ విధించింది. ఆ తర్వాత 2007లో విడుదలై మంచి ఆదరణ పొందింది.
ద పింక్ మిర్రర్
లింగమార్పిడి, స్వలింగ సంపర్కుల మధ్య శృంగారం నేపథ్యంలో శ్రీధర్ రంగయాన్ దర్శకత్వం(2006)లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రజలను తప్పు దారి పట్టించేలా ఉందని సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసింది. కాని పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై అవార్డులను సొంతం చేసుకుంది.
ఉర్ఫ్ ప్రొఫెసర్
ముంబారు గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో పంకజ్ అద్వాని దర్శకత్వం (2001)లో రూపొందిన ఈ చిత్రంలో అభ్యంతరకరమైన పద జాలం, అశ్లీల సన్నివేశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డ్ ప్రదర్శనని నిలిపి వేసింది.
కామసూత్ర
16వ శతాబ్దంలో నలుగురు ప్రేమి కుల మధ్య శృంగారం నేపథ్యంలో మీరా నాయర్ దర్శకత్వం(1996)లో రూపొందిన ఈ చిత్రంలో మితిమీరిన అశ్లీల సన్నివేశాలు న్నాయని కేంద్ర సెన్సార్ బోర్డ్ విడుదలని నిలిపివేసింది.
ఫైర్
హిందూ కుటుంబంలో స్వలింగ సంపర్కుల మధ్య సంబంధం నేపథ్యంలో దీపా మెహతా దర్శకత్వం(1996)లో తెరకెక్కిన
ఈ చిత్రాన్ని నిలిపివేయాలని శివసేనా సంస్థ బెదిరించడంతో
ఈ విడుదలకు నోచుకోలేదు. ఇందులో ప్రధాన పాత్రలో షబానా అజ్మీ, నందితా దాస్ నటించారు.
బ్యాండిట్ క్వీన్
పోరాటయోధురాలు పూలందేవి జీవితం ఆధారంగా శేఖర్ కపూర్ దర్శకత్వం(1994)లో రూపొందిన ఈ బాలీవుడ్ చిత్రంలో తిరుగుబాటు ధోరణిలో మితిమీరిన హింస, అసభ్య పదజాలం, అశ్లీల దృశ్యాలున్నాయని సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసింది.
ఆ తర్వాత విడుదలై మూడు జాతీయ అవార్డులను సాధించడం విశేషం.
300 చిత్రాలకు పైగా...
గడచిన 15 సంవత్సరాల్లో భారతీయ భాషలన్నింటిలో రూపొందిన దాదాపు 300 చిత్రాల్ని కేంద్రీయ సెన్సార్బోర్డ్ బ్యాన్ చేసింది. 2001 నుంచి 2011ల మధ్యకాలంలో 256 చిత్రాలు బ్యాన్కి గురవ్వడం విశేషం. వీటిల్లో 78 హిందీ, 51 తమిళ సినిమాలు, 15 తెలుగు సినిమాలు, 33 కన్నడ సినిమాలు, 14 మళయాళం సినిమాలున్నాయి.