Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మిస్తున్న చిత్రం 'మెంటల్ మదిలో'. ఈ చిత్రానికి సురేష్బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలోని 'మనవి ఆలకించరాదటే..' అనే పాటను శనివారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో పాత్రికేయులకు ప్రదర్శించారు. అనంతరం ఈ చిత్ర పోస్టర్ను సురేష్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్బాబు మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలు, అనుభూతులకు అద్ధం పట్టే చిత్రమిది. ఇది 'పెళ్ళిచూపులు' చిత్రంలాగానే అందరిని ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. సినిమా నచ్చి విడుదల హక్కులను సొంతం చేసుకున్నాను' అని అన్నారు. 'చిన్న సినిమాకు ప్రోత్సాహం చాలా అవసరం. సినిమా చూసి సురేష్బాబు మెచ్చుకోవడాన్నే తొలి విజయంగా భావిస్తున్నాం. ఆయన మరోసారి మాకు అండగా నిలిచారు. సినిమా చూసి చిన్న చిన్న మార్పులు సూచించారు. ఆయన సహకారం మరువలేనిది. జీవితం, ప్రేమ పట్ల సరైన నిర్ణయాలు తీసుకోలేక తనలో తాను సతమతమయ్యే ఓ యువకుడి కథ ఇది.
కథ నమ్మి ఈ చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. అందరిని అలరించే చిత్రమవుతుంది' అని నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ చెబుతూ, 'గతంలో కొన్ని లఘు చిత్రాలను తెరకెక్కించాను. సినిమా తీయాలనే నా కల ఇన్నాళ్ళకు నెరవేరింది. కచ్చితంగా ఈ చిత్రం ద్వారా నిరూపించుకుంటాను' అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మధుర శ్రీధర్రెడ్డి, ప్రశాంత్ విహారి, మనీషా తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.