Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి కనీసం నాలుగైదు సినిమాలు చేసేవారు. దీంతో చిత్ర పరిశ్రమ ఎప్పుడూ బిజీగా ఉంటూ ఏడాది మొత్తం అందరికీ పనిదొరికేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక స్టార్ హీరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే కనీసం ఏడాది టైమ్ పడుతోంది. తెలుగుతోపాటు
అన్ని ఇండిస్టీల్లోనూ ఇదే తంతు. ఇక బాలీవుడ్లో కూడా షారూఖ్ఖాన్, సల్మాన్ఖాన్, అమీర్ ఖాన్ వంటి తదితర స్టార్ల నుంచి ఓ సినిమా రావాలంటే కచ్చితంగా ఏడాది ఆగాల్సిందే. కానీ స్టార్ హీరో అయినప్పటికీ అక్షరుకుమార్ (అక్కీ) అలా కాదు. అందరికంటే భిన్నంగా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. ఇదొక విశేషమైతే.. నటించిన చిత్రాలన్ని వరుస విజయాలతో 100 కోట్లకి పైగా వసూళ్లు సాధించడం మరో విశేషం. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులకు వినోదంతో పాటు ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలనుకునే హీరోల్లో అక్కీ ఒకరు. 26 ఏండ్ల సినీ కెరీర్లో 120 సినిమాలను అత్యంత వేగంగా పూర్తి చేసి ఇతర హీరోలతో తానెప్పుడూ స్పెషలే అని నిరూపించు కుంటున్నారు. ఇండిస్టీలో పనిచేసేవారికి పని కల్పిస్తూ తానే ఒక మినీ ఇండిస్టీ అనిపించుకుంటున్నారు. అక్కీ సినిమాలతో ఏడాదికి దాదాపు 500 నుంచి 600 కోట్ల బిజినెస్ జరుగుతుందంటే అతిశయోక్తికాదు. ఇటీవల ఆయన్నుంచి విడుదలైన సినిమాలే అందుకు నిదర్శనం. గతేడాది వచ్చిన 'ఎయిర్లిఫ్ట్', 'హౌస్ఫుల్ 3', 'రుస్తూమ్' మూడు చిత్రాలు వంద కోట్లకుపైనే వసూలు చేశాయి. ఇందులో కువైట్ బేస్డ్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ రియల్ లైఫ్ ఆధారంగా కేవలం 30కోట్లతో తెరకెక్కిన 'ఎయిర్లిఫ్ట్' ప్రపంచ వ్యాప్తంగా 231కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇక కామెడీ ప్రధానంగా రూపొందిన మల్టీస్టారర్ ఫిల్మ్ 'హౌస్ఫుల్ 3' సైతం వరల్డ్ వైడ్గా 190కోట్లు కలెక్ట్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన 'రుస్తూమ్' చిత్రం విశ్వవ్యాప్తంగా 216కోట్ల వసూళ్ళను రాబట్టింది. ఈ మూడు చిత్రాలు కలిపితే 700కోట్లకుపైనే అవుతుంది.
ఇక ఈ ఏడాది అక్షరు నుంచి 'జాలీ ఎల్.ఎల్.బి 2', 'నామ్ శబానా', 'టాయిలెంట్: ఏక్ ప్రేమ్ కథ' చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో బ్లాక్ కామెడీ నేపథ్యంలో 30 కోట్లతో రూపొందిన 'జాలీ ఎల్.ఎల్.బి 2' సుమారు 200కోట్లు కలెక్ట్ చేయగా, మరుగుదొడ్ల నేపథ్యంలో విడుదలైన 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' సైతం ఘనవిజయం సాధించింది. కేవలం 18కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదలై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 212 కోట్లను వసూలు సాధించింది. 'నామ్ షబానా' సైతం ఫర్వాలేనిపించుకుంది. ఈ మూడు చిత్రాలు కలిపి ఈ ఏడాదిలో 450 కోట్లకి పైగా కలెక్ట్ చేయడం విశేషం. ఇలా ఒక్క ఏడాది ఒక స్టార్ హీరో నుంచి ఈ స్థాయిలో బిజినెస్ జరగడంతో అటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమాకు పనిచేసే వర్కర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు. వీటితోపాటు ఇవన్నీ డిఫరెంట్ కథా నేపథ్యంతో రూపొందిన వినోదాత్మక చిత్రాలే కావడంతో ప్రేక్షకులు సైతం అక్కీ సినిమాలపై అమితాసక్తి చూపిస్తున్నారు. అక్షరు కుమార్ ఇప్పుడే కాదు కెరీర్ ప్రారంభం నుంచే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఒక్క 2001లో (ఒక్క సినిమానే విడుదలైంది) తప్ప మిగతా అన్ని ఏడాదిల్లోనూ మూడుకుపైగా సినిమాలు విడుదలయ్యాయి.
వేగంగా సినిమాలు చేయడమే కాదు విభిన్నమైన, వైవిధ్యమైన కథాంశాలతో కూడిన సినిమాలు చేస్తూ వస్తున్నారు. అక్షరుకు తొలి బ్రేక్ ఇచ్చిన 'ఖిలాడీ' నుంచి 'యే దిల్లగీ', 'వఖ్త్ హమారా హై', 'మై ఖిలాడీ తూ అనారీ', 'సంఘర్ష్', 'హేరా ఫేరీ', 'ఖట్టా మీఠా', 'ఆంఖేన్', 'తలాష్: ది హంట్ బిగిన్', 'పోలీస్ ఫోర్స్', 'వెల్కమ్', 'సింగ్ ఈజ్ కింగ్', 'రౌడీ రాథోడ్', 'స్పెషల్ ఛబ్బీస్', 'జోకర్', 'ఓ మైగాడ్', 'హాలీడే', 'రుస్తూమ్', 'ఎయిర్లిఫ్ట్', 'జాలీ ఎల్.ఎల్.బి. 2', 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' వరకు వచ్చిన అన్ని చిత్రాలు వైవిధ్యమైనవే. ఆయా చిత్రాల్లో మాస్, యాక్షన్ పాత్రలు, దేశభక్తి పాత్రలు, కామెడీ పాత్రలు, రొమాంటిక్ పాత్రలు చేసి మెప్పించారు. మల్టీస్టారర్ చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేసి తన ధైర్యాన్ని చాటుకున్నారు. అయితే అక్షరు ఏ పాత్ర చేసినా అందులో చాలా వరకు సాధారణమైన వ్యక్తిగానే కనిపిస్తారు. ఇమేజ్ తాలుకా ఛాయలు తక్కువే కనిపిస్తాయి. అందుకే అక్షరు స్పెషల్ సూపర్స్టార్ అనిపించుకుంటున్నారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన జవానులకు, కరువుతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు, ఆపదలో ఉన్న వారికి అపన్న హస్తం అందిస్తూ రియల్ లైఫ్లోనూ హీరో అనిపించుకుంటున్న అక్షరు కుమార్ శనివారం తన 50వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు అక్కీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అభిమానులకు బర్త్డే సర్ప్రైజ్
అక్షరు తన పుట్టిన రోజు సందర్భంగా శనివారం అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'గోల్డ్' చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ''గోల్డ్' తన హృదయానికి దగ్గరైన సినిమా' అని ఈ సందర్భంగా అక్కీ ట్వీట్ చేశారు. ఈ 'గోల్డ్' పోస్టర్ మెడల్పై అక్షరు ఆనాడు ఉన్న గెటప్లో కనిపిస్తున్నారు. పెద్ద స్టేడియం కూడా ఇందులో ఉంది. 1948లో లండన్లో జరిగిన 14వ ఒలింపిక్స్లో భారత్ తొలి ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న నేపథ్యం ఆధారంగా రీమా కడ్గీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మౌని రారు హీరోయిన్గా నటిస్తుండగా, కూనల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. దీంతోపాటు ప్రస్తుతం 'ప్యాడ్మ్యాన్', '2.0', 'మోఘల్: ది గుల్షాన్ కుమార్ స్టోరీ' చిత్రాల్లోనూ అక్కీ నటిస్తున్నారు.