Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, మియా జార్జ్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి 15 మంది కమెడీయన్లు హాజరవ్వడం విశేషం. ఈ సందర్భంగా హీరో సునీల్ మాట్లాడుతూ, 'చేసుకున్న కర్మను అనుభవించే వారిని నవ్వించడమే హాస్యనటులు చేయాల్సిన పని. ఈ మంచి పని భవిష్యత్లో మా పిల్లలకు మంచి చేస్తుందని ఆశ. క్రాంతి మాధవ్ నాలో ఓ యాక్టర్ని చూశారు. నాలోని మరో నటుడిని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. క్వాలిటీ కోసమే సినిమా కాస్త ఆలస్యమైంది. ఈ నెల 15న విడుదలవుతున్న ఈ చిత్రం నాకు మంచి పేరును తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. 'హాస్యనటులు అందరినీ నవ్విస్తారని అనుకుంటారు. మా వెనక చాలా కష్టాలుంటాయి. అలీ నాకు 32ఏండ్ల పరిచయం. తను ఎప్పుడూ బాధపడింది లేదు. ఎవరినీ బాధపెట్టిందీ లేదు. అలాంటిది ఈ మధ్య బాధపడ్డారు. దానికి కారణమే మా అవకాశాలను వేరే వాళ్లకు మళ్లించేంత వెధవలు ఇంకా పరిశ్రమలో ఉండటమే.
ఈ చిత్రం ట్రైలర్లో డైలాగులు విన్నాక 30ఏండ్ల క్రితం నేను చెన్నైలో ఉన్నప్పటి పరిస్థితులు గుర్తుకొచ్చాయి. ఇందులో నేను కూడా మంచి పాత్ర చేశా. సునీల్లో మరో కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. సమాజానికి ఉపయోగపడే సినిమా అవుతుంది. మానవత్వం నేటి మనుషుల్లో లేదు. మాకు స్టేజ్ మీదే నవ్వులుంటాయి. జీవితంలో కాదు. సక్సెస్ ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి. ఈ చిత్రం సునీల్కు మంచి సక్సెస్ను తీసుకురావాలి' అని పోసాని కృష్ణమురళి తెలిపారు. అలీ చెబుతూ, 'ఏ పరిశ్రమలో అయినా కమెడీయన్లకు కలిసి ఉండటమే తెలీదు. ఎంత మంది ఉన్నా, ఎంత పోటీ ఉన్నా తెలుగు పరిశ్రమలో మాత్రమే ఒక ఫ్యామిలీగా ఉండగలరు. ఆ గౌరవం తెలుగు పరిశ్రమకే దక్కింది. ఈ చిత్రంతో సునీల్ తనలోని అన్ని కోణాలను చూపించబోతున్నారు. నాలుగేండ్లు కష్టపడి సునీల్ చేసిన సిక్స్ ప్యాక్ ప్రశంసనీయం. కామెడీ చేసినోడు ఏదైనా చేయగలడని అప్పుడెప్పుడో రజనీకాంత్ అన్నారు. హాస్యనటుడు కామెడీ, ట్రాజెడీ ఏదైనా చేయగలడు. అందుకు ఉదాహరణగా సునీల్ను చెప్పుకోవచ్చు' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి, అదుర్స్ రఘు, సత్య, ప్రవీణ్, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, సప్తగిరి, రఘుబాబు, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆశించారు.