Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'శ్రీవల్లి' ప్రీ రిలీజ్ వేడుకలో రామ్చరణ్
'ఒక సినిమాకు విజయేంద్రప్రసాద్గారి పేరుంటే చాలు అది జాతీయ స్థాయి సినిమా అయిపోతుంది. ఆయన ఆశీస్సులుంటే చాలు సినిమా విజయం ఖాయం' అని రామ్చరణ్ అన్నారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో సునీత, రాజ్ కుమార్ బృందావనం నిర్మించిన చిత్రం 'శ్రీవల్లీ'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రామ్చరణ్ మాట్లాడుతూ, 'నాకు ఆరోగ్యం బాగా లేకపోయినా విజయేంద్రప్రసాద్ కోసం, అభిమానుల కోసం ఈ వేడుకకు వచ్చాను. 'శ్రీవల్లీ'తో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్ సినిమా చూడబోతున్నాం. హాలీవుడ్లో ఈ జోనర్ సినిమాలు చూశాం. కానీ ఇక్కడ చూడలేదు. అంత గొప్ప రచయిత నుంచి సినిమా వస్తోందంటే, అది కూడా ఆయన దర్శకత్వంలో అంటే కచ్చితంగా బాగుంటుంది. 'మగధీర', 'బాహుబలి', 'భజరంగీ భాయిజాన్' వంటి గొప్ప సినిమాలు అందించిన ఆయన సినిమాకు ప్రమోషన్ అక్కర్లేదు. ఆయన పేరుంటే చాలు. అదే ప్రమోట్ అవుతుంది. ఈ సినిమా కోసం అందరిలా నేను కూడా వెయిట్ చేస్తున్నా' అని అన్నారు. 'చరణ్తో మా ప్రయాణం 'మగధీర' కంటే ముందు నుంచే ప్రారంభమైంది. 'సింహాద్రి' తర్వాత రాజమౌళిని చిరంజీవితో సినిమా ఎప్పుడూ అని అడిగితే 'ఆయన వరం ఇవ్వాలంతే' అని రాజమౌళి అన్నారు. అన్నట్టుగానే చిరంజీవి నుంచి ఫోన్ వచ్చింది. 'మగధీర'లోని వందమందిని చంపే ఎపిసోడ్ ఆయనకు చెప్పాం.
ఆ ఎపిసోడ్ విని చిరంజీవి రోమాలు నిక్కబొడిచాయి. కానీ అది చిరంజీవిగారితో చేయడం కుదర్లేదు. దాన్ని చరణ్తో చేసిన 'మగధీర'లో వాడుకున్నాం. చిరంజీవి, రామ్చరణ్లతో 'మగధీర 2' చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 'శ్రీవల్లీ' విషాదం నుంచి పుట్టిన కథ. రమేష్ అనే చిన్ననాటి స్నేహితుడి మరణం ఈ కథ రాయడానికి నాంది పలికింది. ఆలోచనల్ని చదివితే ఏం అవుతుంది. దాని వల్ల ఉపయోగం ఏంటి?అనే అంశం చుట్టూ తిరిగే కథ ఇది. చాలా కొత్తగా ఉంటుంది. ఈ నెల 15న విడుదలయ్యే ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా'
అని విజయేంద్రప్రసాద్ తెలిపారు.
పరుచూరి గోపాలకృష్ణ చెబుతూ, 'విజయేంద్రప్రసాద్ కలం సామాన్యమైనది కాదు. 'మగధీర', 'ఛత్రపతి', 'సింహాద్రి' రాసి హిట్టు కొట్టారు. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించాలి' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీలేఖ, సునీత, రాజ్కుమార్, రజత్ తదితరులు పాల్గొన్నారు.