Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జై లవకుశ' ట్రైలర్ లాంచ్ వేడుకలో కళ్యాణ్రామ్
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవకుశ'. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన వి.వి.వినాయక్ ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ మదనపడిపోయారు. మూడు పాత్రలు పోషించిన ఎన్టీఆర్కి హ్యాట్సాఫ్. అన్నదమ్ములు కళ్యాణ్రామ్, ఎన్టీఆర్ కలిసి తండ్రి హరికృష్ణకు ఇస్తున్న కానుక ఇది. కాని హరికృష్ణగారేమో ఆయన తండ్రి ఎన్టీఆర్గారికి ఇచ్చే కానుక ఈ చిత్రం' అని అన్నారు. 'నెగటివ్ పాత్రలు చేస్తేనే పాజిటివ్ పాత్రలు పండుతాయి. అందుకే నాన్నగారు ఎన్టీఆర్ దుర్యోధనుడు, రావణుడి పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో జై పాత్ర నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది' అని హరికృష్ణ తెలిపారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'ఎన్ని జన్మలెత్తినా అభిమానుల రుణ తీర్చుకోలేను. మంచి సినిమాలు తీసి వాళ్ళ రుణం తీర్చుకుంటాను. 'టెంపర్' చిత్ర విజయం 'నాన్నకు ప్రేమతో' సినిమా చేయడానికి స్ఫూర్తినిచ్చింది. 'జనతా గ్యారేజ్' చేయడానికి 'నాన్నకు ప్రేమతో..' ధైర్యాన్నిచ్చింది. 'జై లవకుశ'లో నటించడానికి 'జనతా గ్యారేజ్' నమ్మకాన్నిచ్చింది. నేను, అన్నయ్య కళ్యాణ్రామ్ కలిసి ఓ సినిమా చేద్దామనుకున్నాం. ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాలేదు. అభిమానులంతా గర్వపడేలా సినిమా చేయాలనుకున్నాం. మా మాట వినే ఆ దేవుడు బాబీని నా దగ్గరకు పంపాడేమో. బాబీ చెప్పిన కథ విని భయపడ్డాను. వారం తర్వాత కలుద్దామని పంపించేశా. కథ బాగుంది. కానీ ఎలా చేయాలో అర్థం కాలేదు. ఈ కథని అత్యంత ఆప్తులైన ఇద్దరితో డిస్కస్ చేశాను. వాళ్ళు 'చేసేరు..' అని ధైర్యం ఇచ్చారు. ఒకేసారి మూడు పాత్రలు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ మేమంతా కలిసి ఓ మంచి ప్రయత్నం చేశాం. అభిమానుల, ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాం. 'జై లవకుశ' అంటే జై ఒక్కడి పాత్ర కాదు, జై, లవ, కుశ కలిస్తేనే ఈ సినిమా. ప్రపంచంలోని అన్నదమ్ములందరికీ ఈ చిత్రం అంకితమిస్తున్నాం' అని చెప్పారు. 'బాబీ ఈ కథ చెప్పినప్పుడు నాకు తాతగారు నటించిన 'దాన వీరశూర కర్ణ' చిత్రం గుర్తుకొచ్చింది. ఆ సినిమాను ఎవ్వరూ టచ్ చేయలేరు. ఇది కూడా అంతటి గొప్ప సినిమా అవుతుంది. తారక్కి ఇప్పటి వరకు చాలా అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు జాతీయ అవార్డు కచ్చితంగా వస్తుంది. ఈ నెల 21న విడుదల కానున్న ఈ చిత్రం అందరిని అలరిస్తుంది' అని కళ్యాణ్ రామ్ చెప్పారు. దర్శకుడు బాబీ చెబుతూ, 'ఏడాది పాటు మాట్లాడుకోవాల్సిన సినిమా ఇది. తెలుగు పరిశ్రమ కాలర్ ఎత్తుకుని గర్వంగా చెప్పుకునే నటుడు ఎన్టీఆర్. ఈ సినిమాకు పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా' అని అన్నారు.