Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎప్పటికైనా 'మహాభారతం' సినిమా తీయాలనేది రాజమౌళి కల. అయితే దాన్ని తీయగలనా? లేదా? అని పరీక్షించుకోవడానికి తీసిన సినిమానే 'బాహుబలి'. రాజమౌళి అల్టిమేట్ గోల్ 'మహాభారతం' తీయడమే' అని అంటున్నారు రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో సునీత, రాజ్కుమార్ బృందావనం సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శ్రీవల్లీ'. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు విజయేంద్రప్రసాద్తో మంగళవారం మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఈ చిత్ర కథకు స్ఫూర్తి?
- నాకు రమేష్ అనే చిన్ననాటి స్నేహితుండే వాడు. ఇద్దరం కలిసి చదువుకున్నాం. కలిసి అల్లరి చేశాం. నాకోసం వాడు దెబ్బలు తిన్నాడు. నేను ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నప్పుడు సాయం చేశాడు. హైదరాబాద్ వచ్చి, ఆర్థికంగా నేను మెరుగైన తర్వాత రమేష్ని కలిసి ఏదైనా సాయం చేద్దామని చాలాసార్లు అనుకున్నాను. కానీ కుదరలేదు. ఓసారి విజయవాడలోని వాళ్ళ ఇంటికి వెళ్లా. అతని ఫొటోకు దండ వేసి ఉంది. వినాయక చవితి టైమ్లో తీవ్ర జ్వరం వచ్చి చనిపోయాడట. ఆ విషాద సంఘటనలో నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. ఓ రోజు ఈ చిత్ర నిర్మాతలు సునీత, రాజ్కుమార్ నా దగ్గరికొచ్చి, ఓ మంచి సినిమా తీయాలనుకుంటున్నాం. కథ కొత్తదై, ఇప్పటివరకు రానిదై ఉండాలన్నారు. అంతేకాదు నన్నే డైరెక్ట్ చేయమని కూడా చెప్పారు. అందుకే ఈ కథను ఎంపిక చేసుకుని, దర్శకత్వం వహించా.
సినిమా నేపథ్యం గురించి?
- తరంగాల రూపంలో మన ఆలోచనలు ఎదుటి వారికి , ఎదుటి వారి ఆలోచనలు మనకు చేరతాయి. ఈ నేపథ్యానికి నాటకీయత జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కించాం. ఒక అమ్మాయి మనసుపై ప్రయోగం జరిగే సమయంలో ఆమె గత జన్మ స్మృతుల్లోకి వెళ్తుంది. ఆ జ్ఞాపకాల్లో ప్రేమ ఉంటుంది. దీంతో ఆమె జీవితం ఎలాంటి
గందరగోళ పరిస్థితులకు లోనయ్యింది.
చివరికి దాన్నుంచి ఆమె ఎలా బయటపడిందనేది సినిమా. సినిమాటిక్గా చెప్పాలంటే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ.
కొత్తవారితో ఈ సినిమా చేయటానికి రీజన్?
- సబ్జెక్ట్ సంక్లిష్టంగా ఉన్నా ప్రేమ కథ, దాని చుట్టూ తిరిగే అంశాలు సాధారణ ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అవుతాయి. దీనికితోడు కావాల్సిన వ్యాపార హంగులన్ని సమకూర్చాం. కొత్త కథ కావడంతో కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. 'శ్రీవల్లీ' అనేది ఈ చిత్రంలో భావతరంగాలను కనిపెట్టేందుకు చేసే మిషన్ పేరు. స్టార్ హీరోలతో చేస్తే కథ ఎలివేట్ కాదు. అదే కొత్త వాళ్లైతే కథను స్ట్రాంగ్గా చెబుతూ తీయోచ్చు. కొత్తవారితో తీసినప్పటికీ పెట్టిన డబ్బు రిటర్న్ రావాలి. నిర్మాతలు సేఫ్గా ఉండటం కూడా ముఖ్యమే. దీని కోసం కథకు ఎంత అవసరమో అంతే బడ్జెట్ ఖర్చు చేశాం. కొత్తవారైనప్పటికీ రజత్, నేహా హింగే చాలా బాగా చేశారు.
ఫస్ట్కాపీ చూసిన వారి స్పందన ఏమిటి?
- ఈ చిత్ర కథను రాజమౌళి, క్రిష్, సుకుమార్తోపాటు మరికొంత మందికి నెరేట్ చేశాను. చెప్పేటప్పుడు నెక్ట్స్ సీన్ ఏంటో ఊహించమని చెప్పా. కానీ ఎవ్వరూ ఊహించలేకపోయారు. కథ వింటూ చాలా థ్రిల్ ఫీలయ్యారు. అలాగే పరుచూరి గోపాలకృష్ణకు ఇటీవల సినిమా చూపించా. ఆయన కూడా నెక్ట్స్ సీన్ ఏంటో గెస్ చేయలేకపోయారు. 'సినిమా అద్భుతంగా తీశావ్ ప్రసాద్' అని ఆయన ప్రశంసించడం అత్యుత్తమ అవార్డు పొందిన ఫీలింగ్ కలిగింది. పీహెచ్డి వచ్చిందన్నంతగా సంతోషపడ్డాను.
బాలీవుడ్ ప్రాజెక్ట్ 'మణికర్ణిక' గురించి?
- 'బాహుబలి' తర్వాత పలు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. అలా వచ్చిందే 'మణికర్ణిక'. నిర్మాత కమల్ జైన్ నన్ను కలిసి కంగనా రనౌత్తో ఝాన్సీ లక్ష్మిభాయి సినిమా చేయాలను కుంటున్నాం కథ రాయండి అని చెప్పడంతో ఆ కథ రాశాను. లక్ష్మిభాయి అసలు పేరు మణికర్ణిక. అయితే క్రిష్ దర్శకుడైతేనే ఈ కథ రాస్తాననే నిబంధన పెట్టాను. వాళ్లూ సరే అన్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నిక్ పవన్ పనిచేస్తుండటం విశేషం. యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.
'బాహుబలి' తర్వాత మీలో వచ్చిన మార్పు?
- మార్పేం లేదు. దాన్ని గొప్ప కథ అనుకుని రాయలేదు. 'బాహుబలి' కథ కూడా కొత్తదేం కాదు. అత్తా కోడళ్ళ మధ్య వార్, అన్నదమ్ముల మధ్య వార్. కానీ దాన్ని తెరపై చూపించడంలోనే కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు నిర్మాతలు నిజాయితీగా రచయితల దగ్గరికొచ్చి కథలు రాయమని అడిగేవారు. ఆ తర్వాత ఆ కల్చర్ పోయింది. 'బాహుబలి' తర్వాత నిర్మాతలు వచ్చి 'మంచి కథ రాయండి ప్రసాద్గారు' అని అడుగుతున్నారు. రచయితల్ని గుర్తిస్తున్నారు. అలాగే రచయితలకు గౌరవం కూడా పెరిగింది. కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్కి మన వాళ్ళపై చిన్నచూపు ఉండేది. మన కంటే వాళ్ళు గొప్ప అని భావిస్తుంటారు. 'బాహుబలి' తర్వాత తెలుగు వాళ్ళు కూడా మంచి సినిమాలు తీయగలరని వాళ్లూ గుర్తించారు.
రాజమౌళి సినిమా ఎప్పుడుంటుంది?
- అది ఆయన్నే అడగాలి. రాజమౌళి 'మహాభారతం' తీయాలని కోరుకుంటున్నా. ఎప్పటికైనా 'మహాభారతం' తీయాలనేది అతని కల కూడా. దాన్ని తీయగలనా? లేదా? అని టెస్ట్ చేసుకోవడం కోసమే 'బాహుబలి' తీశాడు. భవిష్యత్లో మాత్రం కచ్చితంగా 'మహాభారతం' తీస్తాడు. అయితే దానికి చాలా టైమ్ పడుతుంది. చిరంజీవి, రామ్చరణ్లతో 'మగధీర 2' తీయాలనేది నా కోరిక. దానికీ రాజమౌళినే దర్శకత్వం వహించాలి. తమిళంలో రూపొందుతున్న 'మెర్సల్'కు స్క్రీన్ప్లే, హిందీలో 'నాయక్' చిత్రానికి సీక్వెల్కు కథ అందిస్తున్నాను. త్వరలో తెలుగులో ఒక చిత్రానికి, బాలీవుడ్లో ఒక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాను.