Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు 'తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్స్'లో స్థానం దక్కింది. ఈ ధృవీకరణ పత్ర ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఈ ధృవీకరణ పత్రాన్ని రామసత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ, '2004లో వచ్చిన 'ఎస్.పి.సింహా' చిత్రంతో రామసత్యనారాయణ నిర్మాతగా మారి, ఇటీవల విడుదలైన 'అవంతిక'తో 12ఏండ్ల సినీ జీవితంలో 92 సినిమాలను నిర్మించారు. మరో ఎనిమిది సినిమాలు నిర్మించి సెంచరీ కొట్టడమే కాకుండా, వచ్చే పదేండ్లలో మరో వంద సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'రామసత్యనారాయణ అంటే మా నాన్నకు విపరీతమైన అభిమానం. మా చాగల్లులో ఆయన్ని సన్మానించాలని మా నాన్నగారు కోరుకునే వారు. ఆయన వంద సినిమాలు పూర్తి చేయగానే చాగల్లు తీసుకెళ్లి ఘనంగా సన్మానిస్తా' అని వి.వి.వినాయక్ తెలిపారు. 'ఇంత మంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ స్ఫూర్తితో మరిన్ని సినిమాలు తీస్తాను' అని టి.రామసత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్మెన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, కె.వి.వి.సత్యనారాయణ, సాయి వెంకట్, పి.డి. నాగేంద్ర, భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లలితారావ్, ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షులు డా|| కె.వి.రమణారావు, వంశీరామరాజు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్ వరప్రసాద్, రాధ తదితరులు పాల్గొన్నారు.