Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ సమస్యలను పరిష్కరించాలంటూ తమిళనాడుకి చెందిన రైతులు గత కొద్ది కాలంగా ఢిల్లీలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. నిరసనలో భాగంగా మలాన్ని సైతం తిన్న రైతుల దయనీయ స్థితి అందరినీ కలచివేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ రైతుల సంక్షేమం కోసం కథానాయకుడు విశాల్ తీసుకున్న నిర్ణయం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. విశాల్ హీరోగా నటించిన 'తుప్పరివాలన్' చిత్రం గురువారం విడుదలైంది. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. డిటెక్టివ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయెల్, ఆండ్రియా కథానాయికలుగా నటించారు. గురువారం విడుదలైన ఈ చిత్రానికి అమ్ముడయ్యే ప్రతి టికెట్టులో ఒక రూపాయిని కష్టాల్లో ఉన్న రైతుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వనున్నట్టు విశాల్ ప్రకటించారు. దీంతోపాటు ప్రస్తుతం తమిళ నడిఘర్ సంఘం అధ్యక్షులుగా ఉన్న విశాల్ ఆర్టిస్టుల సంక్షేమం కోసం కూడా పలు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో రాజకీయాల్లోకీ వెళ్ళనున్నట్టు ఇటీవల విశాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక హీరోగా ప్రస్తుతం 'విలన్', 'ఇరుంబు థిరై', 'కరుపు రాజ వెల్లై రాజా' చిత్రాల్లో నటిస్తున్నారు.