Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దానర్థం సబ్జెక్ట్ను రిజెక్ట్ చేసినట్టు. అంతేకాని అందులో నటించిన స్టార్ను రిజెక్ట్ చేయడం కాదు' అని అంటున్నారు హీరో సునీల్. క్రాంతి కుమార్ దర్శకత్వంలో సునీల్, మియా జార్జ్ జంటగా నటించిన 'ఉంగరాల రాంబాబు' చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో శనివారం హీరో సునీల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే...
పాజిటివ్ టాక్..
శుక్రవారం విడుదలైన సినిమాకు అత్యద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇటీవల కాలంలో నేను నటించిన 'జక్కన్న' సినిమా కమర్షియల్గా బాగా ఆడింది. ఆ తరహాలో ఈ చిత్రానికీ కలెక్షన్లు వస్తున్నాయి. ఆంధ్రాలో అన్ని థియేటర్లు ఫుల్ అయ్యాయి. హైదరాబాద్లో 80శాతం నిండాయి. ఓ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి 'సినిమా చాలా బాగుంది. మీ నెక్ట్స్ సినిమా కూడా నేనే తీసుకుంటాను' అని అన్నారు. ఇలా అంతటా పాజిటివ్గా ఉంది. సినిమాలో సెకండాఫ్ను ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు.
మూడు కథలు చెప్పారు..
క్రాంతి మాధవ్ మొదట నన్ను కలిసినప్పుడు మూడు కథలు చెప్పారు. వీటిల్లో రెండు భారీ ఎమోషనల్స్తో ఉండి, మాస్ ఇమేజ్ ఉన్న పెద్ద హీరోలకు సెట్ అయ్యేలా ఉన్నాయి. కొన్నేండ్లుగా నేను కామెడీ పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. నా నుంచి కామెడీని ఆశిస్తారు. అందుకే కామెడీ టచ్ ఉన్న ఈ స్క్రిప్ట్ ఓకే చేశా. సినిమాలో హీరో ఉంగరాలను బాగా నమ్ముతాడు. దీంతో 'ఉంగరాల రాంబాబు' టైటిల్ పెట్టాం. రైతుల భూమిని కాపాడాలనే దానిపై చిన్న సందేశం ఇవ్వాలని ప్రయత్నించాం. ఈ పాయింట్ నాకు కనెక్ట్ అవ్వడానికి కూడా ఓ కారణముంది. చిన్నప్పుడు మా తాతగారితోపాటు నేను కూడా పొలం పనులకు వెళ్లేవాడిని. ఆయన చనిపోయాక పొలం చూసుకునే బాధ్యత నాపైనే పడింది. అలా రైతుల అంశం నాకు బాగా కనెక్ట్ అయ్యింది.
ఈ ఎపిసోడ్కి మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
కమెడీయన్గా, విలన్గానైనా చేస్తా..
హీరోగా చేస్తూనే కామెడీ ఆర్టిస్టుగా నటిస్తానని గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను. 'అందాల రాముడు' తర్వాత హీరోగా ఛాన్స్లు వచ్చినా 'మర్యాద రామన్న' వరకు ఐదేండ్ల పాటు హీరోగా చేయలేదు. చాలా మంది చేయమని అడిగారు. రాజేంద్రప్రసాద్, గోవింద వంటి వారు చేస్తున్నారు కదా?, వారిని స్ఫూర్తిగా తీసుకుని హీరోగా చేసుకుంటూ వస్తున్నా. 'మర్యాద రామన్న' తర్వాత హీరోగా చేయకూడదనుకున్నా నిర్మాతలు వదల్లేదు. హీరోగా చేస్తున్న టైమ్లో కామెడీ ఆర్టిస్టుగా చేస్తే ఆ సినిమాపై ప్రభావం పడుతుందని నేనూ చేయలేదు. కానీ కామెడీ పాత్రలు చేయడమనేది నాకు రిలీఫ్. అలాగే హీరోగా ఎన్ని చేసినా ఓ ఏజ్ వచ్చాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ హీరో అయినా సరే చేయాల్సిందే. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, తెలుగులో జగపతిబాబు, శ్రీకాంత్ చేస్తున్నారు. కామెడీ పరంగా నాకు నచ్చిన పాత్రలే చేస్తాను. 'ఖైదీ నంబర్ 150'లో కూడా చేయాల్సింది. 'ఈడు గోల్డ్ ఎహే' సినిమా డేట్స్ క్లాష్ రావడంతో చేయలేకపోయాను. హీరోగానే కాదు విలన్గానూ నటించాలని ఉంది. మొదట్లో నేను విలన్గా చేయాలనే ఇండిస్టీకి వచ్చాను. విలన్ను చేయమంటే రాజమౌళి నన్ను హీరో చేశారు. ఇక త్రివిక్రమ్తో సినిమా చేయాలనుంది. ఆయన అనుకున్న కథకు నేను సూట్ అవుతాననుకుంటేనే చేస్తా. నేను హీరోగా మారడంతో నా పోజిషన్ అలాగే ఉందని అంటున్నారు. కానీ నా పొజిషన్కి నాలుగైదుగురు వచ్చారు. ఇప్పుడొచ్చిన కుర్రాళ్ళు కామెడీ బాగా చేస్తున్నారు.
నిర్మాతలకూ రీమేక్లు సేఫ్..
ప్రస్తుతం నటించిన 'టూ కంట్రీస్' రిలీజ్కు రెడీగా ఉంది. తర్వాత 'చతురంగ వెట్టై' రీమేక్లో నటిస్తున్నాను. గోపీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. నా దృష్టిలో స్ట్రయిట్ సినిమాలతో పోల్చితే రీమేక్లే సేఫ్. అది నా విషయంలో చెప్పడం కాదు, వెంకటేష్, సల్మాన్ ఖాన్, అక్షరు కుమార్ సినిమాల సక్సెస్ చూస్తే రీమేక్లే సేఫ్ అనిపిస్తుంది. అవి హీరోలకే కాదు నిర్మాతలకు కూడా సేఫే. ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే ఆ సబ్జెక్ట్ను రిజెక్ట్ చేయడమే అవుతుందిగాని, స్టార్ను రిజెక్ట్ చేయడం కాదు.