Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కాళోజి లాంటి మహాకవి పుట్టిన రోజు సెప్టెంబర్ 9న తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతటి మహోన్నత వ్యక్తి పేరు మీద నాగబాల సురేష్ కుమార్, టీవీ రచయితల సంఘం కలిసి కాళోజి పురస్కారాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని చంద్రబోస్కు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్లకు ఇవ్వడం సముచితంగా భావిస్తున్నాను' అని అన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి. మహాకవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా గత ఐదేండ్లుగా భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం సంయుక్తంగా ఈ పురస్కారం అందిస్తున్నారు. 2016వ సంవత్సరానికిగాను పాటల రచయిత చంద్రబోస్కు, 2017కు గానూ వందేమాతరం శ్రీనివాస్లను ఎంపిక చేశారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో నాగబాల సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. అతిథిగా విచ్చేసిన రమణాచారి అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'డబుల్ మీనింగ్లతో పాటలు రాసి కేవలం డబ్బు సంపాదన కోసమే కాకుండా చంద్రబోస్ లాంటి సర్వేజనా సుఖినోభవంతు అనే రచయితలు ఇండిస్టీకి రావాలి. వందేమాతరం శ్రీనివాస్ కష్టపడి పైకి వచ్చాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తన స్థానాన్ని గాయకుడిగా, స్వరకర్తగా పదిల పరుచుకున్నాడు. ఇక ఇండిస్టీలో చాలా సమస్యలున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న హెల్త్కార్డులు, డబుల్ బెడ్ రూమ్స్ ఇప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున నా వంతు కృషి చేస్తాను. డిసెంబర్లో నిర్వహించే తెలుగు మహా సభలను విజయవంతం చేయాలని టీవీ, సినీ పరిశ్రమ వ్యక్తులను కోరుతున్నా' అని అన్నారు. 'ఈ పురస్కారాన్ని గతంలో గూడ అంజయ్య, సుద్దాల అశోక్ తేజ, జె.కె.భారవిలకు అందజేశాం. గతేడాదికిగానూ చంద్రబోస్కు, ఈ ఏడాదికిగానూ వందేమాతరం శ్రీనివాస్కు అందజేయడం చాలా ఆనందంగా ఉంది. టీవీ పరిశ్రమలో చాలా మంది కార్మికులకు డబ్బింగ్ సీరియల్స్, రియాలిటీ షోల వల్ల సరైన ఉపాధి లేకుండా పోతోంది. వారికి ఉండటానికి ఇల్లు, హెల్త్కార్డులు, ప్రభుత్వం తరపున సహాయం అందిస్తే బాగుంటుందని రమణాచారిని కోరుకుంటున్నాను' అని భారత్ కల్చరల్ అకాడమీ అధినేత, రచయిత నాగబాల సురేష్ కుమార్ తెలిపారు. చంద్రబోస్ చెబుతూ, 'ఇప్పటి వరకు నేను మంచి భాషతోనే పాటలు రాస్తూ వస్తున్నాను. ఇకపై కూడా రాస్తాను' అని చెప్పారు. 'ప్రజా నాట్య మండలిలో కళాకారుడిగా ఉన్న నన్ను వెన్ను తట్టి ఇంతటి గుర్తింపు తెచ్చిన 'అన్న' నల్లూరి వెంకటేశ్వరరావుకు ఈ అవార్డును అంకితమిస్తున్నా' అని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు.