Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'శరభ' టీజర్ లాంచ్ సందర్భంగా దిల్రాజు
ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా జయప్రధ ప్రధాన పాత్రలో ఎన్.నరసింహారావు దర్శకత్వంలో అశ్వని కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం 'శరభ'. ఈ చిత్ర టీజర్ లాంచ్ సోమవారం హైదరాబాద్లోని ప్రసాద్ఐమాక్స్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన దిల్రాజు మాట్లాడుతూ, 'దర్శకుడు నరసింహారావు నా బ్యానర్లో కో డైరెక్టర్గా పనిచేశారు. ఓ రోజు ఓ కథ వినమని నా దగ్గరికొస్తే టి.కృష్ణగారి సినిమాల్లో ఓ మంచి రివల్యూషనరీ సబ్జెక్ట్ ఉంటే చెప్పమన్నాను. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి 'శరభ' అనే సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నానని చెప్పాడు. టీజర్ చూసి థ్రిల్ అయ్యాను. టీజర్లో మ్యాజిక్ ఉంది. సినిమా అంతా ఇదే మ్యాజిక్ ఉంటే సూపర్ హిట్ అవుతుందని చెప్పాను. ఇలాంటి గ్రాఫిక్స్ ఉన్న సినిమాకు డబ్బున్న నిర్మాతలే కాదు, ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా అవసరం. ఆకాష్, సురేష్ మంచి ప్యాషన్ ఉన్న నిర్మాతలు. 'అమ్మోరు', 'దేవి' సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు రావాలంటే చాలా సమయం పట్టింది. అలా ఈ సినిమాకు కూడా చాలా టైమ్ పట్టింది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది' అని అన్నారు. 'నరసింహారావు అప్రెంటిస్గా నా దగ్గర దాదాపు 7ఏండ్లు పనిచేశారు. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని మనస్తత్వం తనది. టీజర్ చూస్తుంటే మంచి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. భవిష్యత్లో నరసింహారావు పెద్ద దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నా' అని ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తెలిపారు.
చిత్ర దర్శకుడు ఎన్.నరసింహారావు తెలియజేస్తూ, 'ముందు ఓ హీరోతో ఈ చిత్రాన్ని చేయాలని ప్రయత్నించాను. కుదరలేదు. కొందరు నిర్మాతలు బడ్జెట్ విషయంలో వెనకడుగు వేశారు. ఆకాష్ తండ్రిని కలిసి కథ చెప్పా. ఆయన మార్పులు చెప్పారు. నేను వినలేదు. రెండు రోజుల తర్వాత ఆయన తన కొడుకుతో ఈ సినిమా చేయమన్నారు. ముందు వద్దన్నాను. ఆకాశ్తో నాలుగు రోజులు గడిపిన తర్వాత ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. తను గోల్డెన్ స్పూన్తో పుట్టిన కుర్రాడు. ఈ సినిమా కోసం అతన్ని బాగా ఇబ్బంది పెట్టాను. కోటిగారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రం అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాం' అని చెప్పారు. 'ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం అందించారు. నేను అతనికి సహాయం చేశానంతే. కథకు తగ్గట్టుగా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుదిరింది' అని సంగీత దర్శకుడు కోటి తెలిపారు. హీరో ఆకాష్ మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం మూడున్నరేండ్లుగా ట్రావెల్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని నేను కాదు కథే నన్ను ఎంచుకుందని ఈ జర్నీలో నాకు తెలిసింది. ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. జయప్రద, తనికెళ్ళ భరణి, నాజర్ ..ఇలా గొప్ప గొప్ప సీనియర్స్తో పనిచేసే అవకాశం కలిగింది. నన్ను నమ్మి ఈ చిత్రానికి ఎంపిక చేసుకున్న దర్శకుడికి కృతజ్ఞతలు' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ పట్నాయక్, సాయిమాధవ్ బుర్రా, గోరేటి వెంకన్న, చరణ్దీప్, మిస్తీ, రమణసాల్వ, ఎల్.బి.శ్రీరాం తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.