Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గల్ఫ్ గాథల నేపథ్యంలో సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం 'గల్ఫ్'. చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే ప్రధాన పాత్రధారులుగా శ్రావ్య ఫిల్మ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు, ఎం.ఎస్.రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 'యు/ఎ' సర్టిఫికెట్ పొందింది. అక్టోబర్ నెలలో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో గల్ఫ్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల కడగండ్లను కళ్ళకు కట్టినట్టు చూపించాం. ఇది ప్రజల హృదయాలకి హత్తుకునేలా ఉంటుంది. కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. సామాజిక సమస్యలని వెండితెరపై వాస్తవానికి దగ్గరగా చూపించే దర్శకుడు సునీల్ కుమార్రెడ్డి ఈ చిత్రం కోసం అక్కడ నివసిస్తున్న ప్రవాస కార్మికుల జీవితాలపై విస్తృత పరిశోధన చేసి ఈ చిత్ర కథని సమకూర్చారు. వాస్తవాలను ప్రతిబింబింప చేస్తూనే యువతరానికి నచ్చే హంగులను కూడా చిత్రంలో మిళితం చేశారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రచార చిత్రాలను, పాటలను, వినూత్న తరహా ప్రచారాలని చూసిన ప్రేక్షకులు ఈ చిత్రం విడుదల కోసం వేచి చూస్తున్నారు. దర్శకుడు సునీల్ కుమార్రెడ్డి గల్ఫ్ కార్మికుల కోసం పడుతున్న తపన ఈ చిత్రంతో తప్పక ఫలప్రదం అవుతుంది' అని అన్నారు. 'యువతరానికి నచ్చే రొమాంటిక్, కమర్షియల్ అంశాలను మేళవించి రూపొందించిన చిత్రమిది. గల్ఫ్లో పనిచేస్తున్న 25 లక్షల కార్మికుల సమస్యలపై గళమెత్తి వారికి తమదైన శైలిలో ఈ చిత్రం ద్వారా పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నాను. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఈ చిత్రంలో గల్ఫ్ సమస్యలని వివరంగా చూపించడమే కాకుండా నిజ జీవితంలో కూడా గల్ఫ్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సమస్యలని పరిష్కరించడానికి కమిటీలను, రాష్ట్ర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా తెలుగు రాష్ట్రాలలోనే కాక, గల్ఫ్ దేశాలలో కూడా మా వంతు కృషి చేస్తున్నాం' అని దర్శకుడు తెలిపారు.