Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితీష్ రెడ్డి, అమృత, నందిని హీరో,హీరోయిన్లుగా సాగర్ దర్శకత్వంలో ఫార్చ్యూన్ మూవీస్ పతాకంపై అశోక్రెడ్డి, సతీష్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ప్రభాస్'. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎఫ్.డి.సి.చైర్మెన్ రామ్మోహనరావు క్లాప్నివ్వగా, కె.ఎస్.రామారావు కెమెరా స్విచాన్ చేశారు. ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ, '1983లో 'రాకాసి లోయ' చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాను. ఇప్పటి వరకు నేను తీసిన అన్ని సినిమాలు వేటికవే భిన్నమైనవి. నేను ఇప్పటి వరకు తీయని రేర్ సబ్జెక్ట్తో కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్, ప్రేమ ఇలా అన్ని అంశాల సమాహారంగా ఈ చిత్రం ఉంటుంది. కొన్ని కంపెనీలు కలిసి ఈచిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాయి. వాటి సహకారంతో రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తాను. గతంలో చైల్డ్ ఆర్టిస్టుగా నిరూపించుకున్న నితీష్రెడ్డిని ఈ చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయం చేస్తున్నా. ఆయన ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేశారు. ఆయనకు తెలుగులో ఎంట్రీకి ఇది మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రంలో హీరో పేరు ప్రభాస్రెడ్డి. పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయి. పాత్ర తీరుతెన్నులు ఆకట్టుకునేలా ఉంటాయి. దీపావళి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, వైజాగ్, చైనాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేశాం. ఇందులో తండ్రి పాత్ర కోసం బాలీవుడ్ నటుడు నానా పటేకర్ను తీసుకోవాలని భావిస్తున్నాం' అని అన్నారు.