Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజశేఖర్, పూజా కుమార్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జ్యోస్టార్ట్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కోటేశ్వరరాజు నిర్మిస్తున్న చిత్రం 'పి.ఎస్.వి.గరుడవేగ 126.18ఎం'. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా అంబికాకృష్ణ మాట్లాడుతూ, 'రాజశేఖర్ విలన్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎదిగారు. 'శేషు' వంటి విలక్షణమైన సినిమా చేయాలన్నా, శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించాలన్నా రాజశేఖర్కే చెల్లింది. ఈ సినిమాతో ఆయన మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటారని ఆశిస్తున్నా' అని అన్నారు. రాజశేఖర్ చెబుతూ, 'నేను చాలా ఫెయిల్యూర్స్ను ఫేస్ చేసిన తర్వాత విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయమని అడిగారు. నేను కూడా సరే అనుకున్నా. 30నుంచి 40 కథలను విన్నా. ఒక్కటీ నచ్చలేదు. ఆ టైమ్లో ప్రవీణ్ సత్తారు ఈ కథతో వచ్చారు. నేను పీక్స్లో ఉన్నప్పుడు ఇలాంటి కథతో సినిమా చేయాలనుకున్నా. భారీ బడ్జెట్తో, హాలీవుడ్ స్టాండర్డ్స్లో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఈ కథను ప్రవీణ్ హ్యాండిల్ చేయగలడా అనిపించింది. నేను నటించిన 'మగాడు' సినిమాలో నా పాత్ర అంత పవర్ఫుల్గా చూపిస్తా అన్నాడు. అనడమే కాదు అంతే అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాతలు కోటేశ్వరరాజు, ఆయన భార్య హేమ గారు రాజీపడకుండా సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. సినిమాను ముందు ఐదారు కోట్లలో తీయాలనుకున్నాం. కానీ చివరకు 25కోట్లు అయ్యింది. ఈ టీజర్ను మా పిల్లల స్నేహితుడి చూసి 'టీజరే మాట్లాడుతుంది. మీ నాన్న ఏం మాట్లాడాల్సిన పనిలేదు' అన్నారట. ఇది మా ఇంటిలో పెళ్లిలాంటి సినిమా. పెళ్ళికి అందరినీ పిలిచినట్టు ఈ సినిమాను అందరికి పిలిచి చూపిస్తాను' అని అన్నారు.
'సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ జర్నీలో నా టీం అందించిన సపోర్ట్ మరిచిపోలేను. లార్జ్ స్కేల్లో ఉండే స్క్రిప్ట్ ఇది. ఇలాంటి సినిమా చేయడానికి రాజశేఖర్లాంటి హీరో అవసరం అనిపించి ఆయన్ని కలిశాను. నాపై నమ్మకంతో ఆయన ఈ సినిమా చేశారు. సినిమా ఇంత బాగా రావడానికి జీవితగారు అందించిన సపోర్ట్ మరచిపోలేను. సినిమా విజువల్స్గా చాలా గ్రాండ్గా ఉంటుంది. నిర్మాతలకు కృతజ్ఞతలు' అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. నిర్మాత కోటేశ్వరరాజు చెబుతూ, 'కార్పొరేట్ స్టయిల్లో తీసిన చిత్రమిది. నేను ఆరాధించే హీరో రాజశేఖర్తో ఈ చిత్రం నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో నాస్నేహితులు ఎంతో అండగా నిలిచారు' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూజా కుమార్, జీవిత, హేమ, ఆదిత్, భీమ్స్, శ్రీచరణ్, శ్రీకాంత్ రామిశెట్టి తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.