Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల నామినేషన్కు విదేశీ విభాగంలో మన దేశం నుంచి బాలీవుడ్ చిత్రం 'న్యూటన్' ఎంపికైంది. ఇండియా ఆస్కార్ సెలక్షన్ కమిటీ (జ్యూరీ) చైర్మెన్ సీవీ రెడ్డి ఆధ్వర్యంలో 14 మంది సభ్యులగల జ్యూరీ కమిటీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది.
శుక్రవారం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో జ్యూరీ కమిటీ చైర్మెన్ సీవీ రెడ్డి మాట్లాడుతూ 'ఆస్కార్ అవార్డుల కోసం విదేశీ విభాగంలో భాగంగా 1957నుంచి మన దేశం నుంచి ఒక సినిమాను ఆనవాయితీగా పంపిస్తున్నాం. 2018వ సంవత్సరానికిగాను ఆస్కార్ నామినేషన్కు మనదేశంలోని వివిధ భాషలకు చెందిన 26 సినిమాలు పోటీపడ్డాయి. ఇందులో హిందీ నుంచి 12 సినిమాలుండగా, మరాఠి నుంచి 5 సినిమాలు, తెలుగు, మలయాళం, బెంగాలీ, కన్నడ నుంచి రెండేసి సినిమాలు, తమిళం నుంచి ఒక్క చిత్రం పోటీ పడింది.
వీటిల్లో జ్యూరీ కమిటీ బాలీవుడ్ 'న్యూటన్' చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్కు ఎంపిక చేసింది. తెలుగు నుంచి 'బాహుబలి 2', 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలు పోటీపడ్డాయి. ఈ నెల 16 నుంచి హైదరాబాద్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ఈ చిత్రాల స్క్రీనింగ్ జరిగింది. సబ్జెక్ట్, ప్రొడక్షన్ క్వాలిటీ, డైలాగ్స్, వినోదం, సామాజిక, వాణిజ్య అంశాలు, సంగీతం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 'న్యూటన్' చిత్రాన్ని జ్యూరీ కమిటీ ఎంపిక చేసింది. మన భారతీయ సినిమాలు ఆస్కార్ నామినేషన్కు పంపించినా ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ కావడం లేదు. అందుకు కారణం క్వాలిటీ సినిమాలు లేకపోవడమే. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మన దగ్గర రావడం లేదు. ఆ దిశగా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ దృష్టి సారించాలి' అని అన్నారు.
ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సి.కళ్యాణ్ మాట్లాడుతూ, 'ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఇండియా ఆస్కార్ సెలక్షన్ కమిటీ జ్యూరీ చైర్మెన్ తెలుగువాడే కావడం చాలా ఆనందంగా ఉంది. గత నాలుగేండ్లుగా ఈ ఆస్కార్కు పంపే సినిమాల స్క్రీనింగ్ మన వద్దే జరుగుతోంది. అందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మంచి సపోర్ట్ అందిస్తోంది. తాజాగా ఆస్కార్ నామినేషన్కు ఎంపికైన 'న్యూటన్' చిత్రం శుక్రవారమే విడుదలైంది. విడుదలైన రోజే చిత్రబృందానికి ఆస్కార్కు నామినేట్ ప్రకటన రావడమనేది సినిమా బృందానికి గుడ్న్యూస్. అలాగే మన దేశం తరఫున ఎంపికయ్యే చిత్రానికి కోటి రూపాయలను కేంద్రప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఇవ్వనుండటం విశేషం. వచ్చే ఏడాది ఈ సెలక్షన్ స్క్రీనింగ్ చెన్నైలో జరగబోతుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు శేఖర్ దాస్, అగ్నిమిత్ర పాల్, ఆనంద్ సుబయ, బిజయ జెనా, మిఖిల్ ముసాలె, హరికుమార్, ఎస్.కె.శ్రీవాస్తవ, వీ.కె.ప్రకాష్, ఇంద్రానిల్ ముఖర్జీ, సమీర్ సేన్, అపర్నా సుద్ తదితరులు పాల్గొన్నారు.
మెరవని తెలుగు సినిమా..
ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా తన సత్తా ఏమిటో చూపించింది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు ఈసారి కూడా అందని ద్రాక్షే అయ్యింది. విదేశీ విభాగ ఎంపికకు అర్హత కోల్పోవడం ఓ ఎత్తయితే, కేవలం రెండే రెండు సినిమాలు 'బాహుబలి 2', 'గౌతమిపుత్ర శాతకర్ణి' పోటీలో పాల్గొనడం మరో ఎత్తు. సంఖ్యా పరంగా ఈఏడాది ఇప్పటివరకు దాదాపు 120 సినిమాలు విడుదలయ్యాయి. విడుదలైన ఇన్ని సినిమాల్లో కేవలం రెండు సినిమాలు మాత్రమే ఆస్కార్ పోటీ కోసం వెళ్ళడం, అవి కూడా తొలి మజిలిలోనే ఇంటిదారి పట్టడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం జ్యూరీ సభ్యులు పేర్కొన్నట్టు క్వాలిటీ లేకపోవడమే. కంటెంట్ ప్రధాన చిత్రాల నిర్మాణం ఎక్కువగా జరగక్కపోవడమే అనేది స్పష్టమవుతోంది. ఈ ఏడాది తెలుగు సినిమా చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించినా ఇంకా సాధించాల్సింది చాలా ఉందని పై విషయం చెప్పకనే చెప్పేసింది. సరికొత్త కాన్సెప్ట్ కథలతో ఇప్పుడిప్పుడే తన ప్రాభవాన్ని చాటుకుంటున్న తెలుగు సినిమా భవిష్యత్లో ఆస్కార్ను గెలవాలని ఆశిద్దాం.
న్యూటన్ కథేంటంటే..
మన దేశంలో ఎన్నికల వ్యవస్థను, రాజకీయాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ బ్లాక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. న్యూటన్ కుమార్ గవర్నమెంట్ క్లర్క్. అతనికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్ఘడ్లోని వివాదాస్పద అరణ్య ప్రాంతంలో ఎలక్షన్ డ్యూటీ పడుతుంది. అక్కడ భద్రతా దళాల ఉదాసీనత వల్ల, మావోయిస్టు గెరిల్లా దళాల వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాఫీగా ఎలక్షన్స్ను నిర్వహించేందుకు న్యూటన్ కుమార్ పడే స్ట్రగులే
ఈ చిత్ర కథాంశం. అమిత్ వి. మసూర్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దృశ్యమ్ ఫిల్మ్ పతాకంపై మనిష్ ముంద్రా నిర్మించారు. ఇందులో న్యూటన్ కుమార్ పాత్రలో బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత రాజ్కుమార్ రావు అత్యద్భుతంగా నటించారు. ఆయనతోపాటు పంకజ్ త్రిపాఠి, అంజలి పాటిల్, రఘుబిర్ యాదవ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. స్వప్నిల్ సోనావనె సినిమాటోగ్రఫీగా, నరేన్ చందవర్కర్, బెనెడిక్ట్ టేలర్ సంగీతం అందించిన ఈ చిత్రం శుక్రవారమే విడుదలై, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు ప్రముఖుల ప్రశంసలను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటికే 67వ బెర్లిన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్, హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఎంపికై అవార్డులను గెల్చుకుంది. అలాగే నార్త్ అమెరికాలో నిర్వహించే ట్రిబెకా ఫిల్మ్ఫెస్టివల్లోను ప్రదర్శనకు ఎంపికైంది. తాజాగా విదేశీ విభాగంలో 90వ అస్కార్ అవార్డ్స్ నామినేషన్కు ఎంపిక కావడం విశేషం.
ఈ ఏడాది మొత్తం సంతోషమే..
''మా సినిమా ఆస్కార్ నామినేషన్కు ఎంపికవుతుందని అస్సలు ఊహించలేదు. ఈ వార్త విని చాలా ఎగ్జైట్ అయ్యాం. సినిమా రంగంలోనే ఆస్కార్ పురస్కారాలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల నామినేషన్కు విదేశీ విభాగంలో మనదేశం నుంచి మా సినిమా ఎంపిక కావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాకిది ఈ ఏడాది మొత్తం సంతోషాన్నిచ్చే అంశం. నాకే కాదు ఇది మా టీమ్ అందరికి దక్కిన గౌరవం. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రత్యక్ష ప్రసారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను. మా సినిమా ఫైనల్ నామినేషన్ కూడా పొందుతుందని ఆశిస్తున్నాం. నిజాయితీతో చేసిన ప్రయత్నానికి దక్కిన ఫలితమిది''.
- నటుడు రాజ్కుమార్ రావు
అరుదైన గొప్ప గౌరవం..
''మన దేశం నుంచి ఆస్కార్ బరికి మా సినిమా ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప అరుదైన గౌరవంగా భావిస్తున్నాం.
మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తీసిన చిత్రమిది. దేశం కూడా అదే కోరుకుంటోందని ఈ ఎంపిక నిరూపించింది. విడుదల రోజే ఈ ప్రకటన రావడం
ఈ సినిమా ఎక్కువ మంది అడియెన్స్కు దగ్గరవడానికి మంచి సమయంగా భావిస్తున్నాం''.
- దర్శకుడు అమిత్
వి.మసూర్కర్