Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''జైలవకుశ' చిత్రం దర్శకుడిగా నాకెన్నో కొత్త విషయాలను నేర్పింది. మంచి కథ తయారు చేసుకుంటే పెద్ద హీరోలు కూడా వెయిట్ చేస్తారని తెలుసుకున్నాను' అని అంటున్నారు దర్శకుడు బాబీ (కె.ఎస్.రవీంద్ర). ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవకుశ' చిత్రానికి బాబీ దర్శకుడు. రాశీఖన్నా, నివేదా థామస్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాత. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో దర్శకుడు బాబీ శనివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలేమిటో ఆయన మాటల్లోనే చూద్దాం.
ఎన్టీఆర్ కోసమే..
ఈ కథను ఆరేండ్ల క్రితమే ఎన్టీఆర్ కోసం రాసుకున్నా. అప్పుడే టైటిల్ కూడా నిర్ణయించుకున్నా. ఎన్టీఆర్ 'అదుర్స్'లో రెండు పాత్రలను అద్భుతంగా పోషించారు. త్రిపాత్రాభినయంతో ఉన్న ఈ కథకు ఆయన మాత్రమే న్యాయం చేయగలరనిపించి, ఆరేండ్లు వెయిట్ చేశా. కథ నెరేట్ చేసేటప్పుడే ఆయనలో పాజిటివ్ ఫీలింగ్ కనిపించింది. కచ్చితంగా ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని చేస్తాడని పించింది. కళ్యాణ్రామ్కి కూడా కథ నచ్చడంతో ప్రాజెక్ట్ సెట్ అయ్యింది.
అదే సినిమాకు ప్లస్ అయ్యింది..
సినిమాలో నెగటివ్ ఛాయలున్న జై పాత్ర రూపకల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చింది. రావణ వ్యక్తిత్వం కలిగిన ఆ పాత్ర సినిమాకు మైనస్ అవుతుందని ఎప్పుడూ అనిపించలేదు. మూడు పాత్రల్ని ఎన్టీఆరే చేస్తున్నారు కాబట్టి ప్రేక్షకులకు ప్రతినాయకుడైన జై పాత్రపై వ్యతిరేకత రాదనిపించింది. మంచి, చెడు, రాక్షస ప్రవృత్తి గల మూడు లక్షణాలను ఒకే కథలో చూపించాలనే ఆలోచనే ఈ సినిమా కథకు బీజం పడింది. స్క్రిప్ట్ దశలో మూడు పాత్రల్ని తీర్చిదిద్దడం కష్టంగా అనిపించినా, మూడు పాత్రల్లో ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేసి ప్రాణం పోశారు. సినిమాకు ఆయన నటనే హైలైట్గా నిలిచింది. క్లైమాక్స్లో జై మరణించినట్టుగా చూపించడం సినిమాకు ప్లస్ అయ్యింది. ఒకవేళ జై పాత్ర బతికినట్టుగా చూపిస్తే రొటీన్ సినిమా అయ్యేది. ఆ పాత్ర చనిపోవడాన్ని ప్రేక్షకులు కూడా పాజిటివ్గానే స్వీకరించారు.
ఓ మెట్టు ఎక్కించిన చిత్రమిది..
ఈ సినిమాకు లభించిన ప్రశంసల్ని నా కెరీర్లో ఎప్పుడూ చూడలేదు. సినిమా విడుదలైన రోజు కొంత టెన్షన్ పడ్డాను. సినిమా బాగుందని అభిమానులు కొన్ని వందల సంఖ్యలో మెసేజ్లు పంపారు. దీంతో సినిమా విజయం ఖామయని భావించా. సినిమాపై మొదట్నుంచి కళ్యాణ్రామ్ కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఇప్పుడదే నిజమైంది. గురువారం విడుదలైన సినిమా మంచి కలెక్షన్లు రాబట్టుకుంటోంది. సినిమా విడుదలయ్యాక రాజమౌళిగారిని కలిశాను. 'దర్శకుడిగా, రచయితగా రెండు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించావు. మూడు పాత్రల్ని చక్కటి వేరియేషన్స్తో అద్భుతంగా తీర్చిదిద్దావు. క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా నచ్చింది' అని రాజమౌళి ప్రశంసించడం దర్శకుడిగా నాలో మరింత విశ్వాసాన్ని నింపింది. అంతేకాదు దర్శకుడిగా నన్నొక మెట్టు ఎక్కించిన చిత్రమిది.
ఆ వార్తల్లో నిజం లేదు..
నాకు కమర్షియల్ లెక్కలు తెలియవు. ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే ఉద్దేశ్యంతోనే సినిమాలు చేస్తాను. ఈ చిత్ర కథను మొదట రవితేజతో అనుకున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. రవితేజతో చేయాలనుకున్న కథ వేరు. భవిష్యత్లో ఆయనతో కచ్చితంగా పనిచేస్తాను. నా నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి రెండు, మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి.