Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెద్ద వాళ్లతో పోలిస్తే పిల్లలతో సినిమాలను తెరకెక్కించడం చాలా కష్టం. ఆ శ్రమను గుర్తించి జ్యూరీ సభ్యులు ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు' అని అంటున్నారు దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. స్వీయ దర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన బాలల చిత్రం 'ఆదిత్య' (క్రియేటీవ్ జీనియస్).
మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా సుధాకర్ గౌడ్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,'బాలల చిత్ర దర్శకుడిగా నంది పురస్కారం దక్కడం ఆనందంగా ఉంది. విద్యాసంస్థల అధిపతిగా, విద్యావేత్తగా చిన్నారుల పట్ల నాకు కొన్ని బాధ్యతలున్నాయని భావించాను. అందుకే ఈ చిత్రాన్ని రూపొందించాను. పిల్లల సినిమా అనగానే చిన్నచూపు చూస్తుంటారు. నిర్మాణ విలువలు బాగుండవని కామెంట్స్ చేస్తారు. అయితే ఈ చిత్రాన్ని నేను దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో, పేరున్న నటీనటులతో, ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మించాను. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశం అభివృద్ధి చెందా లంటే రేపటి తరంలో మరెందరో అబ్దుల్కలాంలు రావాలి. అందుకోసం ప్రతిభగల పిల్లలను వెన్ను తట్టి ప్రోత్సహించాలనే విషయాన్ని ప్రధానంగా చూపించాం. చిన్న చిన్న పరాజయాలకు, తప్పులకు పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పర్యావరణ హితాన్ని గుర్తు చేసే అంశాలను, పిల్లలకు స్ఫూర్తి కలిగించే విషయాలను ఈ చిత్రంలో ప్రస్తావించాం. ఈ నంది అవార్డు దర్శకుడిగా నా బాధ్యతను మరింత పెంచింది. మరిన్ని బాలల చిత్రాలను నిర్మిస్తాను' అని తెలిపారు.