Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమోగ్ దేశపతి, అర్చన్, శ్రేయావ్యాస్ నాయకానాయికలుగా షెరాజ్ దర్శకత్వంలో స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పి.వి.సత్యనారాయణ నిర్మించిన చిత్రం 'షాలిని'. లయన్ సాయివెంకట్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో 75 రోజులను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో 75 రోజుల వేడుకను చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ,'మా చిత్రం 75 రోజులు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న సినిమా 75 రోజులు ప్రదర్శితమవ్వడం మామూలు విషయం కాదు. దర్శకుడిగా షెరాజ్ సత్తా చాటుకున్నాడు. చిన్న సినిమాలు విడుదలవ్వడం గగమవుతున్న ఈ రోజుల్లో మా చిత్రం ఏకంగా 75 రోజులు ఆడటం మరిన్ని చిన్న చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తిదాయకం' అని చెప్పారు. 'మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చిన్న సినిమాలకు ప్రేక్షకులు గట్టి సపోర్ట్ ఇచ్చారు. డిజిటల్ వ్యవస్థ వల్ల చిన్న సినిమాలకు పెద్ద దెబ్బగా పరిణమిస్తోంది' అని దర్శకుడు అన్నారు. 'దర్శకుడు షెరాజ్ మంచి కథ, కథనంతో ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు ప్రమోషన్ విషయంలోనూ ఆయన అవలంబించిన తీరు కొత్తగా ఉంది. దీన్ని ప్రేక్షకులు కూడా స్వాగతించారు. 75 రోజులు పూర్తి చేసుకున్న ఈచిత్రం శతదినోత్సవం జరుపుకోవాలి' అని ఆర్.కె.గౌడ్ చెప్పారు. 'కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని 'షాలిని' చిత్రం మరోమారు నిరూపించింది' అని కవిత అన్నారు. 'ప్రస్తుతం చిన్న చిత్రాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మా చిత్రం ఏకంగా 75 రోజులు ప్రదర్శితమైంది. తొలి ప్రయత్నంలోనే నిర్మాతగా మంచి గుర్తింపు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది' అని నిర్మాత పి.వి.సత్యనారాయణ అన్నారు.