Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాతల శ్రేయస్సు, సినీ పరిశ్రమ మనుగడకి సంబంధించి గతం నేర్పిన గుణపాఠాల్ని లెక్క చేయని నిర్లక్ష్య వైఖరి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాల విడుదల విషయంలో ఇప్పటికీ మన దర్శక, నిర్మాతల ధోరణి మారలేదు. కనీసం అవగాహన పెంచుకునే ప్రయత్నమూ చేయడం లేదు. ఒక రోజులో రెండు సినిమాలు విడుదలవ్వడానికి, పది సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఉన్నతేడా ఏమిటో కూడా గమనించలేని దయనీయ స్థితిలో మన దర్శక, నిర్మాతలుండటం శోచనీయం.
బడ్జెట్ స్థాయి ఏదైనప్పటికీ సినిమాల విడుదల విషయంలో సినిమా సినిమాకి కనీసం రెండు వారాలు లేదా వారం రోజులైనా గ్యాప్ తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వల్ల సదరు చిత్రాల నిర్మాతలు లాభాల బాట పట్టకపోయినా కనీసం సేఫ్ జోన్లో ఉంటారని సినీ పెద్దలు, విశ్లేషకులు పదే పదే చెబుతున్నప్పటికీ ఎవ్వరూ దీన్ని పాటించక పోవడం గమనార్హం. ఒకేరోజు లెక్కకు మించి సినిమాలను విడుదల చేస్తున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది.
గుణపాఠాల్ని సైతం పట్టించుకోని ఈ ధోరణి సదరు నిర్మాతలకే కాదు, తద్వారా పరిశ్రమపై ఆధారపడిన ప్రతి ఒక్కరిపై తీవ్ర నష్ట ప్రభావాన్ని చూపుతుంది. ఈ నిర్లక్ష్య వైఖరి ఈ ఏడాది చాలా స్పష్టంగా కనిపించింది. అలాగే సినిమాల విడుదల విషయంలోనూ సరైన అవగాహన, ఆలోచన, సర్దుబాటు, ప్లానింగ్తో వ్యవహరించడం లేదని ఎన్నో శుక్రవారాలు నిరూపించాయి.
మన దేశంలోని చాలా భాషా చిత్ర పరిశ్రమలకు శుక్రవారం.. ఓ పెద్ద పండుగ. అంతేకాదు పరీక్ష రోజు కూడా. ఆ రోజునే ఎక్కువ శాతం మంది సినిమాలను విడుదల చేస్తుంటారు. ఏండ్ల తరబడి ఇదొక సంప్రదాయంగా వస్తోంది. విడుదలైన సినిమాల ఫలితాల్ని, నటీనటులు, దర్శక, నిర్మాత భవితవ్యాన్ని నిర్దేశించే రోజుగా శుక్రవారం ప్రాముఖ్యతను సంతరించు కుంది. 'శుక్రవారం' వస్తోందంటే చాలా టెన్షన్గా ఉంటుందండీ అంటూ చాలా మంది నటీనటులు తమ చిత్రాల విడుదల టైమ్లో చెప్పిన సందర్భాలు కోకొల్లలు.
ఈ ఏడాది చాలా శుక్రవారాల్లో లేదా ఒకేరోజులో కనీసం నాలుగు నుంచి ఆరు సినిమాలు విడుదలయ్యాయి. ఒకేరోజు ఎక్కువ సినిమాలు విడుదలవ్వడం వల్ల లాభాల కన్నా నష్టాలే అధికం. సరైన థియేటర్లు దొరక్కపోవడం, కొంతమందికి కనీస థియేటర్లు దొరక్కపోవడం, సినిమాలు బాగున్నప్పటికీ కలెక్షన్లు డివైడ్ అయిపోవడం, విశేష ప్రేక్షకాదరణ ఉన్నప్పటికీ తక్కువ టైమ్లోనే థియేటర్ల నుంచి సినిమాలను తొలగించడం, సినిమాలను తీసుకున్న పంపిణీదారులు ఎక్కువ మొత్తంలో నష్టపోవడం వంటి కారణాలు అందరిన్నీ ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. దీంతోపాటు పెద్ద హీరోల సినిమాల విడుదల కోసం బాగా ఆడుతున్న చిన్న సినిమాలను థియేటర్ల నుంచి తొలగించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఈ విషయంపై ఇప్పటికీ చిన్న నిర్మాతలు పోరాటం చేస్తూనే ఉన్నారు.
కొంత మంది నిర్మాతలు ఎంతో పకడ్బందీగా పక్కా ప్లానింగ్తో సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. దూర దృష్టితో ఈ నిర్మాతలు చేసిన ప్రయత్నాలూ చాలా సార్లు ఫలించడం లేదు. వీళ్ళు ముందుగానే విడుదల తేదీలను ప్రకటించినప్పటికీ మిగిలిన వాళ్లలో అవగాహన, సర్దుబాటుతనం లేకపోవడం, ఇగోలకు పోవడంతో ఒకే రోజు ఎక్కువ సినిమాలొస్తున్నాయి. 'నేనే రాజు నేనే మంత్రి', 'లై', 'జయ జనకీ నాయక' ఈ మూడు చిత్రాలు (11-08-2017) ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ మూడు చిత్రాల తాలూకా నిర్మాతలకు పరిశ్రమలో మంచి గుర్తింపు, పలుకుబడి ఉన్నాయి. ఇద్దరు నిర్మాతలకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా ఉంది. వారికి అందుబాటులో కోరిన థియేటర్లూ ఉన్నాయి. అయితే ఒకే రోజు మూడు సినిమాలు విడుదల్వడం వల్ల నష్టం ఉందని భావించి, ముగ్గురు నిర్మాతలను ఒక్కొక్క సినిమాకు కనీసం ఒక్కొక్క రోజు గ్యాప్ తీసుకుని విడుదల చేస్తే బాగుంటుందనే దిశగా సినీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఫలితంగా భారీగా వచ్చే ఓపెనింగ్స్ డివైడై ఎవ్వరికీ ఆశించిన ఫలితాన్ని దక్కకుండా చేశాయి. సినిమాల జయాపజయాలు, కలెక్షన్ల విషయంలోనూ సదరు చిత్ర నిర్మాతలు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి 6న 'ఇద్దరమ్మాయిల ప్రేమకథ', 'ఇంకేటి నువ్వే చెప్పు', 'ఎవరో..తనెవరో', 'బీటెక్ లవ్స్టోరీ', 'పడమటి సంధ్యారాగంలో', 'ఏ రోజైతే చూశానో నిన్ను', 'నెం.1 హీరో రాజేందర్' వంటి తదితర ఏడు చిత్రాలు విడుదలై ఈ రకమైన నిర్లక్ష ధోరణిని చాటింది. అలాగే మార్చి 17వ తేదీన 'మా అబ్బాయి', 'నేనోరకం', 'పిచ్చిగా నచ్చావ్', 'హ్యాపీ బర్త్డే', 'కన్నయ్య', 'ఏటీమ్ వర్కింగ్' వంటి ఆరు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మార్చి 31న 'గురు', 'రోగ్', 'సినీ మహల్', 'దిగ్బంధన', 'కారులో షికారు కెళ్తే', 'ఓ పరిచయం' (ఆరు చిత్రాలు), ఏప్రిల్ 7వ తేదీన 'శరణం గచ్ఛామి', 'అరణ్యంలో', 'చిన్ని చిన్ని ఆశలు', 'కత్రినా కరీనా మధ్యలో ...', 'లక్ష్మీ దేవి సమర్పించు' (ఐదు చిత్రాలు), ఏప్రిల్ 21న 'దడ పుట్టిస్తా', 'రిజర్వేషన్', 'లంక', 'ఇద్దరి మధ్య 18', 'మాచిదేవ', 'లవర్బారు' (ఆరు చిత్రాలు), ఆగస్ట్ 8న 'నక్షత్రం', 'దర్శకుడు', 'గ్రీన్కార్డ్', 'ఇదేం దెయ్యం', 'బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్', 'వశం' (ఆరు సినిమాలు), అక్టోబర్ 6న 'లావణ్య విత్ లవర్ బార్సు', 'బావ మరదళ్లు', 'నేను కిడ్నాప్ అయ్యాను', 'ఓరు నిన్నే', 'గల్ఫ్' (5 చిత్రాలు) ప్రేక్షకుల ముందుకొచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
అయితే ఇప్పటివరకు నాలుగు నుంచి ఆరు చిత్రాల వరకే విడుదలైతే, నేడు (శుక్రవారం) ఏకంగా 9 చిత్రాలు విడుదలవ్వడం శోచనీయం. వీటితోపాటు మరో 5 ఇంగ్లీష్, హిందీ, తమిళ అనువాద చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వెరసి ఒకే రోజు 14 చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. 'లండన్ బాబులు', 'ప్రేమతో మీ కార్తీక్', 'గృహం', 'రారా', 'ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం', 'స్నేహమేరా జీవితం', 'లవర్స్ క్లబ్', 'డేర్', 'దేవిశ్రీ ప్రసాద్', 'ఖాకి', 'అక్సర్ 2', 'జస్టీస్ లీగ్', 'ది లాస్ట్ హర్రర్', 'బేబీ' చిత్రాలు ఒకేరోజు బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
ఒకేరోజు ఇన్ని సినిమాలు విడుదలవ్వడం వల్ల జరిగే భారీ నష్టం ఓ ఎత్తయితే, వీటి తాలూకా తీవ్ర ప్రభావం వారం రోజుల క్రితం విడుదలైన సినిమాల పైనే కాదు, రాబోయే వారంలో విడుదలయ్యే సినిమాలపైనా ఉంటుంది.
గత శుక్రవారం (10-11-2017) 'కేరాఫ్ సూర్య', 'ఒక్కడు మిగిలాడు', 'డిటెక్టివ్' వంటి మూడు చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాల ఫలితం వెంటనే తెలిసి పోతుంది. కాని ఫర్వాలేదు అనిపించుకున్న సినిమాలు నిలదొక్కుకోవడానికి కనీసం వారం రోజులు పడుతుంది. ఈ వారంలో సదరు చిత్రాల యూనిట్ చేసే ప్రమోషన్తో పాటు పబ్లిక్ మౌత్ టాక్ ఆ సినిమాని ఓ వారం రోజుల పాటు థియేటర్లలో ఉండేలా చేస్తాయి. కరెక్ట్గా సినిమా నిలదొక్కుకునే టైమ్లో తాజాగా విడుదలయ్యే సినిమాల కోసం థియేటర్ల నుంచి తొలగించాల్సి వస్తుంది. నిలదొక్కుకుని కలెక్షన్లు కలెక్ట్ చేసే తరుణంలో అసలు థియేటర్లోనే సినిమా లేకపోతే ఆ నిర్మాతకు వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. దీంతో ఆ నిర్మాతే కాదు ఆ సినిమాని తీసుకున్న పంపిణీదారులూ నష్టపోతారు. ఇంత తీవ్ర నష్ట ప్రభావాన్ని చూపుతున్న ఈ అంశంపై అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇదిలా ఉంటే, రాబోయే శుక్రవారం (24-11-2017) రోజు కూడా 'బాలకృష్ణుడు', 'మెంటల్ మదిలో', 'జంధ్యాల రాసిన ప్రేమకథ', 'ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండీ బాబూ' వంటి తెలుగు స్ట్రయిట్ చిత్రాలతో పాటు 'హే పిల్లగాడ' మలయాళ అనువాద చిత్రం, 'జూలీ 2' హిందీ చిత్రం వంటి ఆరు చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ శుక్రవారం (17-11-2017) విడుదలయ్యే పదికిపైగా చిత్రాలు ప్రేక్షకాదరణ కోసం నిలదొక్కుకునే లోపే మరో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈ వారం విడుదలైన కొన్ని చిత్రాలను నిర్మొహమాటంగా థియేటర్ల నుంచి తొలగించాల్సి వస్తుంది. అలాగే మరికొన్ని చిత్రాలు థియేటర్ల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తుంది. మొత్తమ్మీద లాభాల మాట ఎలా ఉన్నా కనీసం ఏ సినిమా కూడా సేఫ్ జోన్ కలెక్షన్లను కలెక్ట్ చేయలేదు.
సినిమా కూడా వ్యాపారాత్మకమే. నష్టం వస్తే ఏ నిర్మాతైనా మరొక సినిమాని నిర్మించేందుకు సాహసం చేయలేడు. ఈ సమస్య ఒక సినిమా నిర్మాతకే పరిమితం కాదు. ఈ మూడు వారాల్లో విడుదలయ్యే ప్రతి ఒక్క సినిమా నిర్మాతది. అంటే దాదాపు ఇరవై మంది నిర్మాతలపై నష్టాల ప్రభావం ఉంటుంది. ఈ నష్టాల ప్రభావం రాబోయే చిత్ర నిర్మాణ సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని ఫలితం పరిశ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్కరిపైనా పడుతుంది. దీంతో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఎటువంటి ఇగోలకు తావులేకుండా సరైన ప్లానింగ్, అవగాహన, సర్దుబాటుతో నిర్మాతలు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- రెడ్డి హనుమంతరావు