Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' చిత్రాల పరాజయంతో తదుపరి చిత్రంపై మహేష్బాబు ప్రత్యేక దృష్టిపెట్టారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. కైరా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న విషయం విదితమే. ఇందులో మహేష్ సీఎంగా నటిస్తున్నారని తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నారట. దర్శకుడు కొరటాల శివ రూపొందించిన 'శ్రీమంతుడు'లో గ్రామాన్ని దత్తత తీసుకోవడం, 'జనతా గ్యారేజ్'తో పర్యావరణ పరిరక్షణ అనే సామాజిక సందేశాన్ని కమర్షియల్ వేలో చూపించి సక్సెస్ అందుకున్నారు. అందులో భాగంగా తాజా మహేష్బాబు సినిమాను సైతం సందేశాత్మకంగా తెరకెక్కించబోతున్నారట.
దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది. చదువు విషయంలో ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఏం చేశాడు. వాటి పరిష్కారానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారనే అంశాలను ఈ చిత్రంలో చర్చించబోతున్నారని తెలుస్తుంది. ఇది సమకాలీన సమస్య కావడంతో ప్రజలందరికీ త్వరగా కనెక్ట్ అవ్వడంతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.