Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ 'గరుడవేగ' కమర్షియల్గా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది' అని అంటున్నారు నటుడు చరణ్ దీప్. 'బిల్లా రంగా', 'బాహుబలి', 'జిల్లా', 'లోఫర్' వంటి చిత్రాల్లో చరణ్ దీప్ విలన్గా నటించి మెప్పించారు. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'పి.ఎస్.వి.గరుడవేగ.126.18ఎం' చిత్రంలో తొలిసారి పాజిటివ్ రోల్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మూడవ వారంలోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చరణ్ దీప్ శనివారం మీడియాతో ముచ్చటించారు. 'కడపకు చెందిన నేను బి.టెక్ పూర్తయిన తర్వాత సినిమాల్లోకి రావాలనుకున్నాను. మొదట్నుంచి నాకు విలన్ వేషాలంటే ఇష్టం. మన తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల కోసం బాలీవుడ్ వాళ్ళనో, ఇతర భాషల నుంచో తీసుకొచ్చేవారు. ఎందుకలా తీసుకొస్తున్నారని ఆరా తీస్తే సిక్స్ప్యాక్ బాడీ, బాడీ లాంగ్వేజ్ బాగా ఉండటమే అని అర్థమైంది. అందుకే వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్తో పరిశ్రమలోకి అడుగుపెట్టాను. చిన్న చిన్న పాత్రలు చేస్తూ, 'అంతం' చిత్రంలో హీరోగా నటించాను. ఆ సినిమా అంతగా ఆడలేదు. తమిళంలో 'జిల్లా' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే కన్నడలోనూ రెండు సినిమాలు చేశా. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' విలన్గా మంచి గుర్తింపునిచ్చింది. ఇక కమర్షియల్గా 'గరుడవేగ' చిత్రం బ్రేక్నిచ్చింది. ఇందులో నేను తొలిసారి పాజిటివ్ రోల్ చేశా. ఎన్ఐఏ అధికారిగా హీరో రాజశేఖర్తోపాటు సినిమా మొత్తం కనిపిస్తా. వెంకట్రావు పాత్రకు నన్ను ఎంపిక చేసిన ప్రవీణ్ సత్తారుకి ధన్యవాదాలు. నా పాత్రను, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా ఇప్పటికే 22కోట్లకుపైగా వసూలు చేసింది. మూడవ వారంలోనూ కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. ఇకపై విలన్గానే కాదు పాజిటివ్, కామిక్ విలన్ ఎలాంటి పాత్రలైనా చేస్తా. ప్రస్తుతం 'శరభ', 'భరత్ అనే నేను', తమిళంలో శివకార్తీకేయన్ చిత్రాల్లో నటిస్తున్నాను. 'అరుంధతి'లో సోనూసూద్ తరహా పాత్రను 'శరభ'లో పోషిస్తున్నాను' అని అన్నారు.