Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'వానవిల్లు'. శ్రావ్య, విశాఖ హీరో, హీరోయిన్లుగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై లంకా కరుణాకర్ దాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన ఎస్.వి.కృష్ణారెడ్డి ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'హీరో ప్రతీక్ కథ, స్క్రీన్ప్లే, డాన్సులు, ఫైట్స్ ఇలా అన్ని విభాగాలు చూసుకుంటూ డైరెక్ట్ చేశాడు. ఇలా చేయాలంటే కసి ఉండాలి. ఆ కసి ప్రతీక్లో ఉంది. నేను కూడా దర్శకత్వం వహిస్తూ మ్యూజిక్, స్క్రీన్ప్లే రైటింగ్, హీరోగా చేశాను. ఈ చిత్ర టీమ్లో మంచి కసి కనిపిస్తుంది. ఈ యూనిట్ పడిన కష్టానికి సక్సెస్ రావాలి' అని అన్నారు.
'చిన్నప్పట్నుంచి డైరెక్టర్ కావాలనే నా కోరిక ఈ రోజు నిజమైంది. నా వంతుగా నేను మంచి ప్రయత్నం చేశాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఓ స్టార్ అని భావిస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు అద్భుతమైన బాణీలను అందించారు. మ్యూజిక్ అందరికీ నచ్చుతుంది. నేను డైరెక్టర్ అవుతాననగానే నన్ను ప్రోత్సహించి ఇక్కడి వరకు తీసుకొచ్చిన నాన్న (లంకా కరుణాకర్ దాస్)కు కృతజ్ఞతలు. దీనికి స్టూడెంట్స్ ఎక్కువగా పనిచేశారు. చాలా కష్టపడ్డాం. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నా. ఈ సినిమా విజయం సాధించినా, సాధించకపోయినా మళ్ళీ సినిమా చేస్తాను' అని ప్రతీక్ ప్రేమ్ కరణ్ చెప్పారు.
నిర్మాత లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ, 'ఒకప్పుడు నేను కూడా సినిమా రంగంలో మ్యూజిక్ విభాగంలో ఉన్నాను. కొద్ది రోజులుగా సినిమా రంగానికి దూరంగా ఉంటున్నా. కానీ ప్రేమ్ నన్ను మళ్ళీ ఈ రంగంలోకి తీసుకొచ్చాడు. మా అబ్బాయి గొప్ప సినిమా చేస్తాడనే నమ్మకం ఉంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్, కోటి, సంగీత దర్శకుడు ప్రభు, గూడూరు నారాయణరెడ్డి, వి.ప్రకాష్, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని కాంక్షించారు.