Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీలక్ష్మి నారాయణ క్రియేషన్స్ పతాకంపై కుందన మ్యూజిక్ అకాడమి సమర్పణలో 'శ్రీ షిరిడి సాయి సప్తస్వరాలు' పేరుతో ఓ ఆడియో ఆల్బమ్ రూపొందింది. సతీష్ సాలూరి సంగీత సారథ్యం వహిస్తున్న ఈ ఆల్బమ్కు పల్లవి వెంకటేష్ వెంగళదాస్ నిర్మాత. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ఆల్బమ్లోని పాటలను ఇటీవల ఫిల్మ్ ఛాంబర్లో ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసురావు, పాటల రచయిత ఏవీఎన్రావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సాలూరి వాసురావు మాట్లాడుతూ, 'సతీష్ మంచి సంస్కారం ఉన్న మనిషి. నా దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ ఆల్బమ్ రూపొందించడం చాలా సంతోషంగా ఉంది. మంచి సంగీతం, సాహిత్యం కుదిరింది. హిందీకి కూడా తగిన విధంగా బాణీలు అందించారు. నా శిష్యుడు అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో సతీష్ పాటలు కంపోజ్ చేశాడు. భవిష్యత్లో మంచి సంగీత దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఈ ఆల్బమ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్ ఉండాలి' అని ఏవియస్ రావు తెలిపారు. పాటల రచయిత పూర్ణాచారి తెలియజేస్తూ, 'ఇటీవల 'ప్రేమమ్' చిత్రానికి రెండు పాటలు రాశాను. వాటికి మంచి పేరొచ్చింది. ఈ ఆల్బమ్లో ఐదు పాటలు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవకాశం కల్పించిన సంగీత దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని చెప్పారు. 'మా పాటల్ని విని మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నా' అని నిర్మాత పల్లవి వెంకటేష్ వెంగళదాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.నాయుడు, శ్యామ్ కొల్లి, గురుచరణ్ తదితరులు పాల్గొని ఆల్బమ్లోని పాటలు బాగున్నాయని
దర్శక, నిర్మాతలను అభినందించారు.