Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పద్మావతి' చిత్రంపై మధ్యప్రదేశ్ ఎంపీ చింతయని మాలియా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ సినిమా వాళ్ళ భార్యలు రోజుకొకరితో వెళ్తారంటూ చేసిన అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆయన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలి' అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, ''పద్మావతి' సినిమాను చూసి నచ్చకుంటే ఆ సినిమాపై మాత్రమే వ్యాఖ్యలు చేయాలి. కానీ సినిమా పరిశ్రమ మొత్తాన్ని తప్పుబట్టడం సరైనది కాదు. పరిశ్రమలోని ఆడవాళ్ళను ఇలాంటి వ్యాఖ్యలతో అవమానించడాన్ని మేం సహించం.
పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఖండిస్తున్నాం. అసలు 'పద్మావతి' సినిమా కథ ఆయనకు తెలుసా? ఆఫ్ నాలెడ్జ్తో చిన్న విషయాన్ని బూతద్దంలో చూసి ఇతరులను తప్పు పట్టడం కరెక్ట్ కాదు. 1540సంవత్సరంలో రాసిన ఒక నవలే 'పద్మావతి'. మంచి కథను విమర్శించేటప్పుడు ఆయా విశేషాలను తెలుసుకోని విమర్శించాలనే ఆలోచన ఒక ఎంపీకి లేకపోవడాన్ని చింతిస్తున్నాం. ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్రమోడీగారిని కలిసి సదరు ఎంపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయనున్నాం. అంతేకాదు నేడు మా ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఎంపీ చింతయని మాలియా దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహిస్తాం. ఎంపీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తాం' అని అన్నారు. 'సినిమా అంటే ప్రతి ఒక్కరికి చులకన భావన ఉంది. వారికి ఎంటర్టైన్ కావాలంటే అదే సినిమానే కావాలి. గొప్ప పేరున్న ఇండిస్టీని తప్పు పట్టి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎంపీపై చర్యలు తీసుకోవాలి' అని నటి కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయివెంకట్, మోహన్గౌడ్ పాల్గొన్నారు.