Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శమంతకమణి' తర్వాత హీరో సుధీర్బాబు.. 'అమీతుమీ' వంటి హిట్ చిత్రాన్ని అందించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అదితి రావు హైదరీ కథానాయిక. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ నూతన చిత్రం గురువారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, 'ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మా బ్యానర్లో వచ్చిన విజయవంతమైన చిత్రం ''జెంటిల్మెన్'. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో సుధీర్బాబు హీరోగా తాజా సినిమాను నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. సుధీర్బాబుకి పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. డిసెంబర్ 11 నుంచి నిరవధికంగా షూటింగ్ చేస్తాం. వచ్చే ఏడాది మార్చిలో చిత్రీకరణ పూర్తవుతుంది. మేలో సినిమాను విడుదల చేస్తాం. హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ముంబయిలోని సరికొత్త లొకేషన్లలో సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేశాం' అని అన్నారు.
'అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఓ కొత్త తరం ప్రేమ కథా చిత్రమిది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుంది' అని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెలిపారు. నరేష్, తనికెళ్ళ భరణి, రోహిణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, శిశిర్ శర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్,
కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్.